PoK Former PM: దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట వద్ద ఇటీవల జరిగిన బాంబు పేలుడు ఘటన యావత్ భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. కట్టుదిట్టమైన భద్రత నడుమ జరిగిన ఈ దాడిపై భారత భద్రతా దళాలు, నిఘా వర్గాలు విస్తృత దర్యాప్తు చేపడుతుండగా, సరిహద్దు ఆవల నుండి వచ్చిన ఒక ప్రకటన ఇప్పుడు పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. ఈ దాడికి తమదే బాధ్యత అన్నట్లుగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) మాజీ ప్రధాని అన్వరుల్ హక్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తున్నాయి.
పాకిస్థాన్ పార్లమెంటు వేదికగా అన్వరుల్ హక్ బహిరంగంగానే భారత వ్యతిరేక విషం చిమ్మారు. ఆయన సభలో మాట్లాడుతూ.. “బలూచిస్తాన్లో మీరు (భారత్) రక్తం చిందిస్తూనే ఉంటే, మేము ఢిల్లీ ఎర్రకోట నుండి కాశ్మీర్ అడవుల వరకు భారత్ను దెబ్బకొడతామని నేను గతంలోనే హెచ్చరించాను. చెప్పినట్లుగానే మేము ఇప్పుడు దానిని చేసి చూపించాము,” అని గర్వంగా ప్రకటించడం గమనార్హం. బలూచిస్తాన్ వ్యవహారానికి ప్రతీకారంగానే ఈ దాడి జరిగిందని ఆయన పరోక్షంగా స్పష్టం చేశారు.
అంతటితో ఆగకుండా, ఈ దాడి తీవ్రతను వివరిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు అత్యంత దారుణంగా ఉన్నాయి. “మేము చేసిన దాడికి అక్కడి మృతదేహాలను లెక్కపెట్టడానికి కూడా భారత్కు సాధ్యం కావడం లేదు.” అంటూ అన్వరుల్ హక్ వ్యాఖ్యానించారు. ఒక మాజీ ప్రధాని స్థాయి వ్యక్తి, పార్లమెంటు సాక్షిగా ఉగ్రవాద చర్యను సమర్థిస్తూ, తామే చేశామని చెప్పుకోవడం పాకిస్థాన్ ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదానికి నిలువెత్తు నిదర్శనమని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ వ్యాఖ్యలు భారత ఏజెన్సీల అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. ఢిల్లీ పేలుళ్ల వెనుక సరిహద్దు ఆవల ఉన్న శక్తుల హస్తం ఉందని భావిస్తున్న తరుణంలో, అన్వరుల్ హక్ ప్రకటనను భారత నిఘా వర్గాలు సీరియస్గా తీసుకున్నాయి. పాకిస్థాన్ నాయకులు బహిరంగంగానే దాడులకు బాధ్యత వహించడం, ఇరు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతలను యుద్ధ వాతావరణం వైపు నెట్టివేస్తోందని రక్షణ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read Also: Sania Mirza: షోయబ్ మాలిక్ కొడుకు పుట్టుకపై అనుమానాలు.. సానియా మీర్జా సంచలన వ్యాఖ్యలు ?