Southwest Monsoon: ఎట్టకేలకు నైరుతి రుతుపవనాలు ఈ ఉదయం కేరళలోకి ప్రవేశించాయి. ఈ విషయాన్ని భారత వాతావరణ శాఖ తెలిపింది. వాస్తవానికి జూన్ ఒకటిన కేరళను రుతుపవనాలు తాకాల్సి ఉంది. అది కాస్త ఆలస్యమైంది. మరో వారం రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఏపీ, తెలంగాణలోకి ప్రవేశించనున్నాయి.
చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ
ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు ఉపశమనం కలిగేలా చల్లని కబురు చెప్పేసింది వాతావరణ శాఖ. నైరుతి రుతుపవనాలు గురువారం ఉదయం కేరళ తీరాన్ని తాకాయి. ఇవాళ ఉదయం నుంచి కేరళ, తమిళనాడు తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లోకి ఈ రుతుపవనాలు వారం రోజుల్లో ప్రవేశించనున్నాయి.
నైరుతి రుతుపవనాలు.. నైరుతి-ఆగ్నేయ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు.. పశ్చిమ మధ్య, తూర్పు మధ్య అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, ఈశాన్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించాయని తెలిపింది. గడిచిన రెండురోజులుగా కేరళలో విస్తారంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాల ఆరంభాన్ని సూచిస్తోందని తెలిపింది.
వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం
గతంతో పోలిస్తే నైరుతి రుతుపవనాలు ఈసారి ఆలస్యంగా దేశంలోకి ప్రవేశించాయి. మే 26న కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ విభాగం తొలుత అంచనా వేసింది. ఈసారి ఎల్నినో ప్రభావంతో అంచనాలు తారుమారు అయ్యాయి. రుతుపవనాలు రాకతో తీర ప్రాంతంలోని అలప్పుళ, కొట్టాయం, ఎర్నాకుళం జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
తమిళనాడులోని 15 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది ఐఎండీ. ఎల్నినో ప్రభావంతో జూన్-సెప్టెంబరు కాలంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదవుతుంది. ఈ విషయాన్యని వాతావరణ విభాగం అంచనా వేసింది. కేవలం 90 శాతం ఈ సీజన్లో కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఎల్నినో పరిస్థితులు కారణంగా జూన్లో బలహీనంగా ఉన్నా సెప్టెంబరు నాటికి బలంగా ఉండే అవకాశం ఉందని వివరించింది.
ALSO READ: రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!