Narendra Modi: ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు (శుక్రవారం) గుజరాత్లోని సూరత్, కేంద్రపాలిత ప్రాంతమైన డామన్లలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రెండు ప్రాంతాలలో కలిపి సుమారు రూ. 21,770 కోట్ల విలువైన పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.
ముందుగా సూరత్లో దాదాపు రూ. 18,800 కోట్ల రూపాయల విలువైన ప్రగతి పనులను ప్రధాని దేశానికి అంకితం చేయనున్నారు. ఇందులో అత్యంత కీలకమైన 8-లేన్ల వడోదర-ముంబై ఎక్స్ప్రెస్వేలోని కొన్ని ప్రధాన ప్యాకేజీలు ఉన్నాయి. దీనితో పాటు గిరిజన ప్రాంతాలలో రవాణా సౌకర్యాలను మెరుగుపరుస్తూ, ప్రపంచంలోనే ఎత్తైన ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’కి కనెక్టివిటీని పెంచేలా జాతీయ రహదారి (NH-56)లోని కొన్ని ముఖ్య విభాగాలను నాలుగు లేన్లుగా విస్తరించే పనులకు మోదీ శంకుస్థాపన చేస్తారు.
ఆ తర్వాత డామన్ పర్యటనలో భాగంగా రూ. 2,970 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించనున్నారు. వీటిలో ముఖ్యంగా రూ. 1,340 కోట్లతో నిర్మించిన ‘నమో విమానాశ్రయం’ కొత్త టెర్మినల్ భవనంతో పాటు అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ‘నమో ఆసుపత్రి’ని ఆయన జాతికి అంకితం చేయనున్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతులు పెరగడమే కాకుండా, పర్యాటకం, వైద్య రంగాలు మరింత బలోపేతం కానున్నాయి.
Also Read: అమీర్పేటలోని షాపింగ్ కాంప్లెక్స్లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!