Gold Paste: దేశంలో బంగారం స్మగ్లింగ్ రోజు రోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. ఎయిర్పోర్టులు, సరిహద్దుల వద్ద భద్రత కట్టుదిట్టం చేసినా అక్రమ రవాణా ఏమాత్రం ఆగలేదు. తాజాగా బంగారాన్ని పేస్ట్ చేసి తీసుకెళ్తున్న జంటను అరెస్ట్ చేశారు కస్టమ్స్ అధికారులు. కొచ్చి ఎయిర్పోర్టులో ఈ ఘటన వెలుగు చూసింది.
కొత్త పుంతలు తొక్కుతున్న బంగారం అక్రమ రవాణ-దేశీయంగా బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీనిపై కేంద్రప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఫలితంగా బంగారం అక్రమ రవాణా మొదలైంది. మంగళవారం కొచ్చిన్ ఎయిర్పోర్టులో దాదాపు రూ. 2 కోట్ల విలువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు.
పేస్ట్ రూపంలో బంగారం తరలింపు-బంగారాన్ని పేస్ట్ రూపంలో తయారు చేసింది ఓ జంట. వారు వేసుకున్న ప్యాంట్ నడుము పట్టీలలో దాచారు. దీనిపై కస్టమ్స్ అధికారులకు సమాచారం రావడంతో క్షుణ్నంగా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో తమిళనాడుకు చెందిన ఓ జంటను అరెస్ట్ చేశారు.
అడ్డంగా చిక్కిన ఓ యువ జంట-నిందితులను పుదుకోట్టై జిల్లాకు చెందిన రిఫ్నాస్ హమీద్ మహమ్మద్ షరీఫ్-అతని భార్య జానోఫర్ కదర్ బీవి ఉమర్ ఫరూక్. జూలై 13న అబుదాబి నుండి ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఎయిర్పోర్టుకు వచ్చారు. ఆ తర్వాత వారి కదలికలపై కస్టమ్స్ అధికారులు ఫోకస్ చేశారు.
జంటను విచారిస్తున్న కస్టమ్స్ అధికారులు-అనుమానం రావడంతో ఈ జంటను అడ్డగించి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వెలికి తీసిన బంగారం సుమారు రూ. 1.94 కోట్లు. 24 క్యారెట్ బంగారాన్ని 1353 గ్రాముల బంగారు పేస్ట్ను స్వాధీనం చేసుకున్నారు.కస్టమ్స్ చట్టంలోని నిబంధనల ప్రకారం ఇద్దరు ప్రయాణికులను అరెస్టు చేశారు. వారిని అధికారులు విచారణ చేస్తున్నారు.
ALSO READ: అమ్మ పెళ్లి సంబంధాలు చూస్తోందని.. ఊహించని షాక్ ఇచ్చిన కూతురు.. ఏం చేసిందంటే?
లభించిన బంగారం ఎవరిచ్చారు? స్మగ్లింగ్ ముఠా కోసం పని చేస్తోందా? దానిపై లోతుగా ఆరా తీస్తున్నారు. కస్టమ్స్ అధికారులు దర్యాప్తుకు సంబంధించిన అదనపు వివరాలు ఇంకా వెల్లడించలేదు. చట్టపరమైన చర్యలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. కొనసాగుతున్న విచారణలో వెల్లడయ్యే అంశాల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని చెబుతున్నారు.