Drug Scam: స్సేచ్చ బ్యూరో: పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కోట్లాది రూపాయల బడ్జెట్ను కేటాయిస్తుంటే, కొందరు స్వార్థపరులైన అధికారులు, వైద్యులు, ఫార్మసిస్టులు కలిసి ఆ నిధులను నిలువునా ముంచేస్తున్నారని విమర్శలు మొదలయ్యాయి. ప్రభుత్వ దవాఖానాల్లో అత్యవసర పరిస్థితుల కోసం కేటాయించిన ‘లోకల్ కోటా’ (స్థానిక కొనుగోళ్ల వెసులుబాటు) ఇప్పుడు అవినీతి తిమింగలాలకు కామధేనువుగా మారింది.
తాజాగా హైదరాబాద్లోని ప్రతిష్టాత్మక గాంధీ ఆసుపత్రిలో వెలుగుచూసిన మందుల కొనుగోళ్ల అక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. కేవలం ఏడు కోట్ల రూపాయల విలువైన మందుల కొనుగోలుకు ఏకంగా 13 కోట్ల రూపాయల బిల్లులు సృష్టించి క్లెయిమ్ చేయడం ఉమ్మడి దోపిడీకి పరాకాష్టగా నిలిచింది. ప్రస్తుత సూపరింటెండెంట్ ఆదేశాలతో పాత పైళ్లను పరిశీలిస్తే, ఈ బాగోతం బయట పడినట్లు తెలుస్తున్నది. దీనిపై విజిలెన్స్ ప్రభుత్వానికి స్పష్టంగా రిపోర్టు ఇచ్చినట్లు తెలిసింది.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం, దవాఖానాల్లో మందుల కొనుగోలు బడ్జెట్ పంపిణీకి స్పష్టమైన నిష్పత్తిని నిర్ణయించారు. ప్రభుత్వం కేటాయించిన మొత్తం బడ్జెట్లో టీజీఎంఎస్ ఐడీసీ ద్వారా 80 శాతం కొనుగోలు జరగాలి. 5 శాతం డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఇండెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. మరో 15 శాతాన్ని అత్యవసర పరిస్థితులు, ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగుల కోసం ఆయా దవాఖానాల్లోనే ‘లోకల్ కోటా’ కింద తక్షణమే కొనుగోలు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇప్పుడు ఈ లోకల్ కోటాలోనే కొంత మంది కుమ్మక్కై చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు సర్కార్ దృష్టికి చేరింది.
Also read: Ganja Smuggling: మేడ్చల్లో భారీ గంజాయి కలకలం.. ఫ్రెండ్స్తో ఎలా దోరికాడంటే..?
వాస్తవానికి సెంట్రల్ మెడిసిన్ స్టోర్లో 3 నెలల బఫర్ స్టాక్ (అదనపు నిల్వ), అలాగే ఆయా ఆసుపత్రులలో కనీసం ఒక నెల బఫర్ స్టాక్ అందుబాటులో ఉండాలి. కానీ, క్షేత్రస్థాయిలో ఈ నిల్వలను కావాలనే మాయం చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సర్జరీకి సరిగ్గా ఒక్క రోజు ముందు “అత్యవసర మెడిసిన్” అంటూ కృత్రిమ కొరతను సృష్టించి, లోకల్ సప్లయర్లతో కుమ్మక్కై భారీ ఎత్తున ఆర్డర్లు ఇస్తున్నట్లు వైద్యవర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఇక టీజీఎంఎస్ ఐడీసీ సరఫరా చేసే రెగ్యులర్ (సాధారణ) మందులను సైతం లోకల్ కోటాలోనే కొనేస్తూ ప్రభుత్వ ఖజానాకు కన్నం వేస్తున్నట్లు తెలిసింది.
గాంధీ ఆసుపత్రిలో గత కొంతకాలంగా మందుల కొనుగోళ్ల వ్యవహారంలో తేడాలు వస్తున్నట్లు ప్రభుత్వానికి పక్కా సమాచారం అందింది. రంగంలోకి దిగిన విజిలెన్స్ విభాగానికి కళ్లు బైర్లు గమ్మే నిజాలు తెలిశాయి. రూ. 7 కోట్ల విలువైన డ్రగ్స్ కొనుగోలుకు గానూ, నకిలీ వోచర్లు, పెంచిన రేట్లతో ఏకంగా రూ. 13 కోట్ల బిల్లులను క్లెయిమ్ చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
Also read: Jagan In Visakha: బోటు ప్రమాదంపై చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం.. ఎందుకు స్పందించలేదని జగన్ ప్రశ్న
ఈ కుంభకోణంలో కొందరు హెచ్ఓడీలు (విభాగాధిపతులు), ఫార్మసిస్టులు, స్థానిక మెడికల్ సప్లయర్లు సిండికేట్గా ఏర్పడి ఈ దోపిడీకి పాల్పడినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి.గాంధీ ఆస్పత్రి వ్యవహారం బయటపడటంతో అలార్ట్ అయిన ప్రభుత్వం హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రి, వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మిగతా ప్రధాన దవాఖాన్లపై కూడా సమగ్ర విచారణకు ఆదేశించింది. ఎక్కడెక్కడ లోకల్ కోటాను దుర్వినియోగం చేశారనే దానిపై ఉన్నతాధికారుల కమిటీలు రంగంలోకి దిగాయి.
ఈ దోపిడీ ముఠాల ఆటకట్టించేందుకు ప్రభుత్వం అత్యంత సీరియస్గా వ్యవహరిస్తోంది. లూప్హోల్స్గా మారిన నిబంధనలను సవరించేందుకు సిద్ధమైంది. అవినీతికి ఆస్కారం ఇస్తున్న ప్రస్తుతం ఉన్న 15 శాతం లోకల్ కోటాను కేవలం 10 శాతానికి కుదించాలని ప్రభుత్వం త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీనివల్ల స్థానిక కొనుగోళ్లపై నియంత్రణ రావడంతో పాటు, కేంద్రీకృత కొనుగోళ్ల ద్వారా పారదర్శకత పెరుగుతుందని భావిస్తున్నారు. ఇందుకోసం గతంలోని జీవోలను రివైజ్డ్ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకోసం అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.
Also read: గులాబీ రంగులో మెరిసే సరస్సులు.. ఈ అందం వెనుక ఇంత కథ ఉందా?