Zomato Delivery Boy: మానవ సంబంధాలు నానాటికి బలహీనమవుతున్న ఈ రోజుల్లో.. మంచితనం ఇంకా బతికే ఉందని నిరూపించే ఘటన తాజాగా చోటుచేసుకుంది. సాధారణ జోమాటో బాయ్ కు కష్టం చూసి.. ఓ కస్టమర్ ఎవరూ ఊహించని పని చేశాడు. ఆపదలో ఉన్న తల్లి వద్దకు వేగంగా చేరుకునేందుకు డెలివరీ బాయ్ కోసం విమానం టికెట్ బుక్ చేశాడు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. కస్టమర్ స్పందించిన తీరు చూసి.. నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.
అంకిత్ పాండే అనే యువకుడు ప్రతిరోజూ లాగే జోమాటో యాప్ ద్వారా ఆహారాన్ని ఆర్డర్ చేశాడు. ఆర్డర్ తీసుకువచ్చిన డెలివరీ బాయ్ అంతకుముందు కూడా కొన్నిసార్లు అంకిత్ ఇంటికి ఫుడ్ డెలివరీ చేసి ఉండటంతో గుర్తు పట్టాడు. అయితే ఎప్పుడూ చురుగ్గా ఉండే ఆ డెలివరీ బాయ్ ఆరోజు మాత్రం చాలా నీరసంగా, కళ్లంతా ఎర్రబడి కన్నీళ్లతో కనిపించాడు. ఆహారాన్ని చేతికి అందిస్తూ చాలా భయపడుతూ, సంకోచిస్తూ అంకిత్ తో మాట్లాడాడు. ‘భయ్యా.. కొంచెం తాగడానికి మంచి నీళ్లు ఇస్తారా?’ అని అడిగాడు. అతని పరిస్థితి చూసి జాలేసిన అంకిత్.. వెంటనే అతడిని లోపలికి రమ్మని కూర్చోబెట్టి ఏం జరిగిందని ఆరా తీశాడు.
Update on yesterday's story…
I wasn't expecting this.
The Zomato delivery partner I booked a flight for yesterday called me this morning.
His first words were,
"Bhaiya… mummy ab danger se bahar hain. Doctor ne kaha 4–5 din mein ghar aa jayengi."
A few minutes later, he… https://t.co/g8r354En4M pic.twitter.com/PDw7TMXXAL
— Ankit Pandey (@iamankitpande) July 11, 2026
నీళ్లు తాగుతూ ఆ డెలివరీ బాయ్ తన బాధను అంకింత్ తో చెప్పుకున్నాడు. ఆ రోజు ఉదయమే అతని తల్లి ప్రమాదవశాత్తు మెట్లపై నుంచి కింద పడిపోయిందని, తీవ్రమైన గాయాలు కావడంతో ఆమెను ఐసీయూ (ICU) లో చేర్చారని చెప్పాడు. ప్రస్తుతం ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు ఫోన్ వచ్చిందని కన్నీరుమున్నీరయ్యాడు. ఎలాగైనా ఊరు వెళ్లాలని చూస్తే.. సొంతూరికి వెళ్లే తదుపరి రైలు రాత్రి 11 గంటలకు ఉందని రైలులో ప్రయాణించడానికి దాదాపు 30 గంటల సమయం పడుతుందని వాపోయాడు. అంత సమయం పడితే తన తల్లిని బతికుండగా చూసుకోగలనో లేదోనని విలవిలలాడిపోయాడు. పైగా బాధలో ఉండి ఉదయం నుంచి అన్నం కూడా తినలేదని అంకిత్ తో చెప్పుకొని బాధపడ్డాడు.
విషయం తెలిసిన వెంటనే అంకిత్.. డెలివరీ బాయ్ కు మెుదట భోజనం పెట్టాడు. ఆపై అతడ్ని త్వరగా సొంతూరికి పంపేందుకు ఆన్లైన్లో మార్గాలను వెతికాడు. రైలు ప్రయాణం ఆలస్యమవుతుందని గ్రహించి వెంటనే సుమారు రూ. 4,000 ఖర్చు చేసి విమానం టికెట్ బుక్ చేశాడు. జీవితంలో ఎన్నడూ ఎయిర్పోర్ట్కు వెళ్లని ఆ డెలివరీ బాయ్ మొదట భయపడినప్పటికీ అంకిత్ తన స్నేహితుడి సహాయంతో అతడిని సురక్షితంగా విమానం ఎక్కించాడు. కొన్ని గంటల్లోనే అతను తన ఊరు చేరుకుని, ఐసీయూలో ఉన్న తల్లిని సమయానికి కలుసుకోగలిగాడు. డాక్టర్లు సకాలంలో చికిత్స అందించడంతో ఆమె ప్రాణాపాయం నుంచి తప్పించుకుందని తెలిసి డెలివరీ ఎంతగానో సంతోషించాడు.
తల్లి క్షేమం గురించి క్లారిటీ రావడంతో డెలివరీ బాయ్ ఎంతో సంతోషంతో మర్నాడు అంకిత్ కు కాల్ చేశాడు. ‘భయ్యా.. మా అమ్మ ఇప్పుడు ప్రమాదం నుంచి బయటపడింది. మరో 4-5 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామన్నారు’ అని చెప్పాడు. అంతేకాకుండా తాను తీసుకున్న రూ. 4,000 మొత్తాన్ని తిరిగి అంకిత్ ఖాతాకు డెలివరీ బాయ్ పంపించాడు. అయితే అంకిత్ ఆ డబ్బును తీసుకోవడానికి ఒప్పుకోలేదు. తిరిగి ఆ డెలివరీ బాయ్ అకౌంట్కే పంపేశాడు. ఆ డబ్బును తల్లి వైద్య ఖర్చులు, మందుల కోసం వాడుకోమని చెప్పాడు.
Also Read: వానకాలంలో కూలర్ మొరాయిస్తోందా? ఈ 5 చిట్కాలతో.. సూపర్ కూలింగ్ పక్కా!
అంకింత్ పాండే ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా తెలియజేయడంతో జరిగినదంతా బయటి ప్రపంచానికి తెలిసింది. ‘కొన్నిసార్లు మనం సాయం చేసిన డబ్బు తిరిగి రాకపోవడమే నిజమైన లాభం. ఒక ప్రాణాన్ని కాపాడటానికి ఒక కొడుకును తల్లి దగ్గరకు చేర్చడానికి ఆ డబ్బు ఉపయోగపడింది. ఆ తృప్తి, ఆ తల్లి దీవెనలు బ్యాంక్ బ్యాలెన్స్ లో కనిపించవు. గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి’ అంటూ అంకిత్ ఆ పోస్టులో పేర్కొన్నారు. అంకిత్ పోస్ట్ కొద్దిసేపటికే వైరల్ కావడంతో.. నెటిజన్లు అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘మానవత్వం ఇంకా బతికే ఉంది’ అనే కామెంట్లతో విపరీతంగా అంకిత్ పాండే పోస్ట్ ను షేర్ చేస్తున్నారు.
Also Read: రూ.50 వేల బడ్జెట్.. చేతినిండా ఆదాయం.. 2026లో టాప్ బిజినెస్ ఐడియాస్ ఇవే!