Power Complaints: స్వేచ్చ బ్యూరో: విద్యుత్ వినియోగదారులకు మరింత వేగవంతమైన సేవలు అందించడంతో పాటు ఫిర్యాదుల పరిష్కారాన్ని స్థానిక స్థాయిలోనే సులభతరం చేసేందుకు ఎస్పీడీసీఎల్ కొత్త విధానానికి శ్రీకారం చుడుతోంది. ఇప్పటి వరకు విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ప్రధానంగా వినియోగంలో ఉన్న 1912 కాల్ సెంటర్కు ప్రత్యామ్నాయంగా సెక్షన్ల వారీగా వాట్సప్ గ్రూపులను ఏర్పాటు చేయాలని సంస్థ యోచిస్తోంది. ఈ మేరకు క్షేత్రస్థాయిలో కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం.
ప్రతీ విద్యుత్ సెక్షన్ పరిధిలోని వినియోగదారులతో ప్రత్యేక వాట్సప్ గ్రూపులను ఏర్పాటు చేయనున్నారు. డీటీఆర్, ఫీడర్ స్థాయిలో కూడా అవసరానికి అనుగుణంగా గ్రూపులు రూపొందించే ప్రతిపాదన ఉంది. ఆయా గ్రూపుల్లో సంబంధిత లైన్ మెన్, లైన్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ) సభ్యులుగా ఉంటారు. వినియోగదారులు విద్యుత్ అంతరాయం, ట్రాన్స్ఫార్మర్ లోపాలు, తీగలు తెగిపోవడం, తక్కువ వోల్టేజ్ వంటి సమస్యలను నేరుగా గ్రూపులో తెలియజేసే అవకాశం కల్పించనున్నారు.
వినియోగదారులు చేసే ఫిర్యాదులపై స్థానిక సిబ్బంది వెంటనే స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకునేలా సంస్థ మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. సంబంధిత అధికారులు రోజంతా గ్రూపుల్లో అందుబాటులో ఉండాలని, ఫిర్యాదులకు ఆలస్యం లేకుండా స్పందించాలని ఎస్పీడీసీఎల్ ఆదేశాలు జారీ చేసే అవకాశముంది. అంతేకాకుండా విద్యుత్ సరఫరా నిలిపివేత, అత్యవసర మరమ్మతులు, నిర్వహణ పనులు, ప్రణాళికాబద్ధమైన పవర్ కట్లు వంటి వివరాలను కూడా ముందస్తుగా వాట్సప్ గ్రూపుల ద్వారానే వినియోగదారులకు తెలియజేయాలని సంస్థ భావిస్తోంది. దీంతో విద్యుత్ అంతరాయాలపై ప్రజలకు ముందుగానే సమాచారం అందడంతో పాటు అనవసర ఇబ్బందులు తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
Also read: Drug Scam: మరీ ఇంత దారుణమా.. గాంధీ హాస్పిటల్లో మైండ్ బ్లాంక్ అయ్యే స్కామ్..?
ప్రస్తుతం విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం వినియోగదారులు ప్రధానంగా 1912 కాల్ సెంటర్పైనే ఆధారపడుతున్నారు. అయితే చిన్నపాటి వర్షం కురిసినా, గాలులు వీచినా ఒకేసారి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు నమోదవుతుండటంతో కాల్ సెంటర్పై తీవ్ర ఒత్తిడి నెలకొంటోంది. ఫలితంగా వినియోగదారులు తమ ఫిర్యాదు నమోదు చేసేందుకు చాలాసేపు కాల్లో వేచి ఉండాల్సి వస్తోంది. కొన్నిసార్లు పలుమార్లు ప్రయత్నించిన తర్వాతే కాల్ కనెక్ట్ అవుతుండగా, మరికొన్ని సందర్భాల్లో ఫిర్యాదు నమోదు కావడానికి కూడా జాప్యం జరుగుతోంది. దీంతో సమస్య పరిష్కారంలో ఆలస్యం అవుతోందన్న అసంతృప్తి వినియోగదారుల్లో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఫిర్యాదులు నేరుగా స్థానిక విద్యుత్ సిబ్బందికి చేరేలా సెక్షన్ల వారీగా వాట్సప్ గ్రూపులను ఏర్పాటు చేయాలని ఎస్పీడీసీఎల్ యోచిస్తున్నట్లు సమాచారం.
ఈ విధానం అమల్లోకి వస్తే వినియోగదారులు 1912కు కాల్ చేయాల్సిన అవసరం లేకుండా గ్రూపులోనే సమస్యను తెలియజేయవచ్చు. సంబంధిత లైన్ మెన్, లైన్ ఇన్స్పెక్టర్, ఏఈలు వెంటనే స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకునే అవకాశం ఉండటంతో ఫిర్యాదుల పరిష్కారం మరింత వేగవంతం అవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ విధానం అమల్లోకి వస్తే వినియోగదారులు స్థానిక విద్యుత్ సిబ్బందితో నేరుగా అనుసంధానం కావడంతో సేవలు మరింత వేగవంతం కావడంతో పాటు ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం తగ్గుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Also read: Minor Driving: పిల్లలపై ప్రేమతో ఇలా చేస్తున్నారా.. అయితే డేంజర్లో పడినట్టే..?