West Bengal: పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్ ప్రాంతంలో పెను విషాదం చోటుచేసుకుంది. బంగాళాఖాతంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల పడవ మునిగిపోవడంతో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రకృతి కన్నెర్రకు బలైన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సముద్రపు అలల ఉధృతికి పడవ బోల్తా పడటమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
అసలేం జరిగిందంటే?
తూర్పు మిడ్నాపూర్ జిల్లాలోని ప్రముఖ తీర ప్రాంతమైన దిఘా నుంచి ఇటీవల 15 మంది మత్స్యకారులు ఒకే పడవలో సముద్రంలోకి వేటకు వెళ్లారు. అయితే, జులై 4వ తేదీన వీరి పడవ కనిపించకుండా పోయింది. తీరం నుంచి వెళ్లిన బోటు ఎంతకీ తిరిగి రాకపోవడంతో పాటు, ఎలాంటి సమాచారం లేకపోవడంతో తోటి మత్స్యకారులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.
రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్స్
మత్స్యకారులు గల్లంతైన విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. సుందర్బన్ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే సోమవారం నాడు బంగాళాఖాతంలో తొమ్మిది మంది మత్స్యకారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను చూసి వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
కొనసాగుతున్న గాలింపు చర్యలు
ఈ ప్రమాదంలో పడవలో ఉన్న మరో ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. సముద్రంలో అలల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ, గల్లంతైన వారి కోసం రెస్క్యూ బృందాలు గాలింపు చర్యలను ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. వాతావరణం అనుకూలించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.
Also Read: తెలంగాణ అభివృద్ధికి 6 సూత్రాలు.. ఎంపీల సమావేశంలో సీఎం రేవంత్ మాస్టర్ ప్లాన్!