Child: టెక్నాలజీ దినదినా అభివృద్ధి చెందుతోంది. అన్ని రంగాల్లోకి రోబోలు దూసుకొస్తున్నాయి. వైద్యరంగంలో కూడా అనేక మార్పులు వచ్చాయి. అన్ని రకాల వ్యాధులకు మందులు అందుబాటులో ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కూడా కొందరు మూఢనమ్మకాలను వీడడం లేదు. తాంత్రికుల మాయమాటలు నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
మధ్యప్రదేశ్లోని షాదోల్ జిల్లాలో మూఢనమ్మకానికి ఓ పసిపాప బలైంది. వ్యాధి తగ్గాలని ఓ మాంత్రికుడి మాయమాటలు నమ్మి 3 నెలల పాపకు వాతలు పెట్టారు. దీంతో చిన్నారి పదిహేను రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.
కథౌటియా గ్రామానికి చెందిన ఓ చిన్నారి కోల్ నిమోనియా అనే వ్యాధిబారిన పడింది. తల్లిదండ్రులు ఆసుపత్రిలో చూపించినప్పటికీ తగ్గకపోవడంతో.. స్థానికుల సలహా మేరకు ఓ తాంత్రికుడి వద్దకు తీసుకెళ్లారు. అక్కడ మాంత్రికుడు పూజలు చేసి ఇనుప రాడ్డును కాల్చి చిన్నారి పొట్టపై 51 సార్లు వాతలు పెట్టాడు. దీంతో చిన్నారి పరిస్థితి మరింత విషమంగా మారడంతో ఆసుపత్రికి తరలించారు.
చిన్నారి పదిహేను రోజుల పాటు ప్రాణాలతో పోరాడి చివరికి కన్నుమూసింది. అయితే తల్లిదండ్రులు ఈ విషయం బయటకు తెలియకుండా హడావుడిగా చిన్నారి అంత్యక్రియలు పూర్తి చేశారు.
అయితే ఈ విషయం మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులకు తెలవడంతో వారు చర్యలు తీసుకున్నారు. ఖననం చేసిన పాప మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టంకు తరలించారు. పాప తల్లిదండ్రులతో పాటు, తాంత్రికుడిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.