Train Accident: బిహార్ రాష్ట్రంలోని జముయి జిల్లాలో గూడ్స్ రైలు ప్రమాదం జరిగింది. ప్రస్తుత సమాచారం ప్రకారం సిమెంట్ లోడ్తో ఆసన్సోల్ నుంచి సీతామఢీకి వెళ్తున్న గూడ్స్ రైలు సిములతాలా రైల్వే స్టేషన్ సమీపంలోని టెల్వాబజార్ హాల్ట్ వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా పట్టాలు తప్పింది. ఈ ఘటన ఒక ఎత్తైన వంతెన (కల్వర్టు) పై జరగడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. రైలు వేగంగా వెళ్తున్న క్రమంలో పట్టాలు తప్పడంతో, సుమారు 19 బోగీలు ఒకదానిపై ఒకటి పడి వంతెన కిందకు దొర్లిపోయాయి. ఒక్కొక్క బోగీలో వందలాది సిమెంట్ మూటలు ఉండటంతో, అవి కింద పడిన ధాటికి పెద్ద ఎత్తున శబ్దం రావడంతో పాటు ఆ ప్రాంతమంతా దుమ్ముతో నిండిపోయింది.
ప్రమాదం జరిగిన సమయంలో రైలు ఇంజిన్ బోగీలకు విడిపోయి సుమారు 400 మీటర్ల దూరం ముందుకు వెళ్లి ఆగింది. అదృష్టవశాత్తూ ఈ ఘోర ప్రమాదంలో లోకోపైలట్, అసిస్టెంట్ లోకోపైలట్, గార్డు ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఇంజిన్ పట్టాలు తప్పకపోవడంతో వారు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే రైల్వే ఉన్నతాధికారులు, రెస్క్యూ టీమ్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. భారీ క్రేన్ల సహాయంతో బోగీలను తొలగించే పనులు ప్రారంభించారు. అయితే, వంతెన కింద బోగీలు పడిపోవడం, సిమెంట్ మూటలు చెల్లాచెదురుగా ఉండటంతో సహాయక చర్యలకు కొంత ఆటంకం ఏర్పడింది.
Also Read: పర్యాటకుల కళ్లముందే విషాదం.. సముద్రంలో కూలిన విమానం.. స్పాట్లో!
ఈ ప్రమాదం కారణంగా ఆ మార్గంలో నడిచే పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కిలోమీటరు మేర పట్టాలు దెబ్బతినడం, విద్యుత్ లైన్లు తెగిపోవడంతో హౌరా-ఢిల్లీ ప్రధాన రైలు మార్గంలో ట్రాఫిక్ను తాత్కాలికంగా నిలిపివేసి, ఇతర మార్గాల్లోకి రైళ్లను మళ్లించారు. పట్టాలు ఎందుకు తప్పాయి అనే విషయంపై రైల్వే శాఖ సాంకేతిక విచారణకు ఆదేశించింది. ట్రాక్ నిర్వహణ లోపమా లేదా మరేదైనా కారణమా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగినప్పటికీ, ప్రాణనష్టం సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
బీహార్లో గూడ్స్ రైలు ప్రమాదం
సిములతాలా వంతెనపై పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
వంతెనపై నుంచి కింద పడిన 19 బోగీలు
టెల్వాబజార్ హాల్ట్ వద్ద ఘటన
సిమెంట్ లోడ్తో అసన్సోల్ నుంచి సీతామఢీకి వెళ్తుండగా ప్రమాదం
400 మీటర్లు ముందుకు వెళ్లి ఆగిన రైలు ఇంజిన్ pic.twitter.com/0STVqxZ1Xe
— BIG TV Breaking News (@bigtvtelugu) December 28, 2025