Trump Phone To Modi: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రధాని మోదీకి ఫోన్ చేశారు. పశ్చిమ ఆసియాలోని పరిస్థితులపై ఈ ఫోన్ కాల్ లో చర్చించారు. వీలైనంత త్వరగా ఉద్రిక్తతలను తగ్గించి, శాంతిని పునరుద్ధరించడానికి భారతదేశం మద్దతు ఇస్తుందని ప్రధాని మోదీ అన్నారు. హర్ముజ్ జలసంధి తెరిచి, సురక్షితంగా, అందుబాటులో ఉండేలా చూడటం ప్రపంచం మొత్తానికి అత్యవసరం అన్నారు. శాంతి, స్థిరత్వం దిశగా చేపట్టే ప్రయత్నాల గురించి సంప్రదింపులు కొనసాగించాలన్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఈ ఫోన్ కాల్ ప్రాధాన్యత సంతరించుకుంది. హర్మూజ్ జలసంధిని తెరిచి ఉంచాల్సిన ప్రాముఖ్యతతో సహా, మిడిల్ ఈస్ట్ లో కొనసాగుతున్న సంక్షోభంపై ఇరు దేశాధినేతలు చర్చించారు.
హర్మూజ్ జలసంధి, చమురు సంక్షోభం, ఇతర అంశాలతో సహా పశ్చిమ ఆసియాలోని ఉద్రిక్త పరిస్థితిపై చర్చించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని మోదీతో టెలిఫోన్లో చర్చలు జరిపారు. భారత్ లో అమెరికా రాయబారి, దక్షిణాసియా, మిడిల్ ఈస్ట్ ప్రత్యేక ప్రతినిధి సెర్గియో గోర్ ఈ విషయాన్ని ఎక్స్ లో తెలిపారు. ‘అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడే ప్రధాని మోదీతో మాట్లాడారు. హర్మూజ్ జలసంధిని తెరిచి ఉంచడంతో సహా మిడిల్ ఈస్ట్ లో కొనసాగుతున్న పరిస్థితిపై చర్చించారు’ అని తెలిపారు.
మిడిల్ ఈస్ట్ యుద్ధం నేపథ్యంలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలతో మోదీ-ట్రంప్ ఫోన్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరాన్పై దాడులను వాయిదా వేయాలని ట్రంప్ తమ బలగాలను ఆదేశించింది. ట్రంప్ ఆదేశాలు వచ్చిన ఒకరోజు తర్వాత టెహ్రాన్ ఇజ్రాయెల్పై పదుల సంఖ్యలో క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడులను ఆపడానికి అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు జరుగుతున్నాయని అమెరికా రాయబారి తెలిపారు. అయితే అమెరికాతో ఎలాంటి చర్చలు జరపడంలేదని ఇరాన్ ప్రకటించింది. దీనిని అమెరికా రెచ్చగొట్టే చర్యగా పేర్కొంది. ఇరాన్పై సైనిక దాడులను నిలిపివేసే ముందు, 48 గంటల్లో హర్మూజ్ జలసంధిని ఓపెన్ చేస్తామన్నారు. కానీ ఇంతలో చర్చలు కొనసాగుతున్నాయని, చర్చల విజయాన్ని బట్టి ఐదు రోజుల పాటు ఇరాన్పై దాడులు నిలిపివేస్తామని ట్రంప్ చెప్పారు.
ప్రపంచ ఇంధన సరఫరాలలో సుమారు 20% చమురు నౌకలు హర్మూజ్ జలసంధి మార్గంలో ప్రయాణిస్తాయి. ఇరాన్ యుద్ధం కొనసాగుతుండడంతో చమురు సరఫరాకు అంతరాయం కలిగించింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి, ఇరాన్ హర్మూజ్ జలసంధిని తమ నియంత్రణలోకి తీసుకుంది. పరిమిత సంఖ్యలో నౌకల రాకపోకలను మాత్రమే అనుమతిస్తుంది. తమ మిత్ర దేశాలకు మాత్రమే హర్మూజ్ ను ఓపెన్ చేస్తుంది. దీంతో భారత్ సహా ప్రపంచ దేశాల్లో ఇంధన సరఫరాకు అంతరాయం ఏర్పడింది.