తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ లభించకపోవడంతో హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. ఈ అనిశ్చితి నడుమ తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత తలపతి విజయ్ చేసిన తాజా సోషల్ మీడియా పోస్ట్ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. 12వ తరగతి ఫలితాల నేపథ్యంలో విద్యార్థులను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
స్టూడెంట్స్ కు అభినందనలు..
12వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో పట్టుదలతో విజయం సాధించిన సోదర సోదరీమణులందరికీ విజయ్ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ విజయం వారి కఠోర శ్రమకు లభించిన గుర్తింపు అని ఆయన కొనియాడారు. విద్యార్థులు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నత విద్యలో తదుపరి దశకు అడుగు పెట్టాలని పిలుపునిచ్చారు. చదువు పట్ల చూపిన శ్రద్ధే భవిష్యత్తుకు బలమైన పునాది అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
నిరాశ వద్దు..
ఆశించిన ఫలితాలు సాధించని విద్యార్థుల పట్ల విజయ్ సానుకూలంగా స్పందించారు. పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేదని ఎవరూ నిరుత్సాహపడకూడదని హితవు పలికారు. ఓటమి అనేది అంతం కాదని.. అది విజయానికి ఒక పాఠమని గుర్తు చేశారు. ‘మళ్ళీ ప్రయత్నించండి.. మనం విజయానికి చేరువలోనే ఉన్నాం’ అంటూ విద్యార్థుల్లో ధైర్యాన్ని నింపారు. జీవితంలో గెలుపోటములు సహజమని.. పట్టుదల వదలకుండా ముందుకు సాగాలని ఆయన సూచించారు.
విజయ్ తన సందేశం చివరలో వాడిన పదజాలం ఇప్పుడు రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. ‘మంచి జరుగుతుంది.. విజయం ఖాయం!’ అంటూ ఆయన ముగించడం కేవలం విద్యార్థుల కోసమే కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు కోసం టీవీకే తీవ్రంగా శ్రమిస్తున్న తరుణంలో.. ఈ వ్యాఖ్యలు నేరుగా రాజకీయ ప్రత్యర్థులను ఉద్దేశించినవేనని స్పష్టమవుతోంది. క్లిష్ట పరిస్థితుల్లో కూడా తానే విజేతగా నిలుస్తాననే ధీమాను విజయ్ ఈ రకంగా వ్యక్తపరిచినట్లు తెలుస్తోంది.
తమిళనాడు యువత భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షిస్తూ విజయ్ తన సందేశాన్ని ముగించారు. కష్టపడి పనిచేయడం వల్లే నిజమైన సార్థకత దక్కుతుందని పేర్కొన్నారు. రాజకీయ అనిశ్చితి కొనసాగుతున్న వేళ.. విజయ్ చేసిన ఈ వ్యూహాత్మక ట్వీట్ ఆయన కేడర్ లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. విద్యార్థుల ఫలితాలను సాకుగా తీసుకుని తన రాజకీయ లక్ష్యాన్ని విజయ్ చాటిచెప్పారని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.