Chennai: తమిళనాడు రాజకీయాల్లో మరొక చారిత్రక పరిణామం. దాదాపు ఆరు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్ర మంత్రివర్గంలోకి అడుగు పెడుతోంది. విజయ్ ప్రభుత్వంలోని ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గురువారం ఉదయం ఈ కార్యక్రమం లోక్ భవన్లో జరగనుంది.
విజయ్ కేబినెట్ విస్తరణ.. మంత్రులుగా ప్రమాణ స్వీకారం
ముఖ్యమంత్రి విజయ్ తన మంత్రివర్గాన్ని విస్తరించారు. దాదాపు 59 ఏళ్ల తర్వాత తమిళనాడు కాంగ్రెస్ నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ద్రవిడ పార్టీలైన డీఎంకే-ఏఐఏడీఎంకే దాటికి తమిళనాడులో కిందకు పడిపోయింది కాంగ్రెస్ పార్టీ. ఆ రాష్ట్ర ప్రభుత్వంలో భాగం కావడానికి ఎన్నడూ అనుమతించలేదు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గురువారం 23 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారని గవర్నర్ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన రాజేశ్ కుమార్, విశ్వనాథన్లను విజయ్ కేబినెట్లోకి తీసుకునేందుకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.
కాంగ్రెస్కు 59 ఏళ్ల నిరీక్షణకు తెర, మంత్రివర్గంలోకి అడుగులు
ఈ విషయాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. 59 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ తమిళనాడు కేబినెట్లో చేరడం ఒక చారిత్రక సందర్భమని పేర్కొన్నారు. కొత్త మంత్రులకు శుభాకాంక్షలు చెప్పారు. అలాగే సంక్షేమ పాలనను కొనసాగిస్తూ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తారని అందులో ఆశాభావం వ్యక్తం చేశారు.
తమిళనాడు శాసనసభలో కాంగ్రెస్పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎన్నికల తర్వాత టీవీకే ప్రభుత్వం ఏర్పాటులో కాంగ్రెస్తోపాటు వామపక్షాలు, వీసీకే, ఐయూఎంఎల్ వంటి పార్టీలు మద్దతు ఇచ్చాయి. ఆయా పార్టీల ఇచ్చిన మద్దతుతోనే విజయ్.. తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మారిన రాజకీయాల నేపథ్యంలో అసెంబ్లీలో బల నిరూపణ సమయంలో సునాయాశంగా విజయం సాధించిన విషయం తెల్సిందే.
ALSO READ: ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ ఫైర్.. దేశ ఆర్థిక వ్యవస్థపై ఆందోళన
విజయ్ ప్రభుత్వంలో తొలిసారి బహుళ పార్టీలతో మంత్రివర్గం ఏర్పాటైంది. విజయ్ మంత్రివర్గంలోకి ఈసారి కనీసం 21 మంది మంత్రులు చేరనున్నారు. తమిళగ వెట్రి కజగం నుంచి 19 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నుంచి ఇద్దరు, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్-ఐయూఎంఎల్, విదుతలై చిరుతైగళ్ కచ్చి-వీసీకే నుంచి ఒక్కొక్కరు చేరుతున్నారు. అయితే కమ్యూనిస్టులు మాత్రం బయట నుంచి మద్దతు ఇస్తున్నారు.
కేబినెట్లోకి టీవీకే ఎమ్మెల్యేలలో మహమ్మద్ పర్వేజ్, శరత్కుమార్, ఆర్ కుమార్, విజయలక్ష్మి లేదా రాజ్కుమార్ ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రితో సహా మంత్రివర్గంలో గరిష్టంగా 35 మంది మంత్రులు ఉండవచ్చు.