Fish Waste Plastic: ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ వ్యర్థాలు పర్యావరణానికి పెద్ద ముప్పుగా మారిన వేళ శాస్త్రవేత్తలు ఒక సంచలనాత్మక ఆవిష్కరణ చేశారు. చేపల వ్యర్థాల నుంచి ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా పనిచేసే ఒక కొత్త పదార్థాన్ని తయారు చేశారు. ‘సైక్లో ప్లాస్ 2’ (Cyclo.Plas 2) అని పిలిచే ఈ మెటీరియల్.. నేలలో వేస్తే కేవలం ఎనిమిది వారాల్లోనే పూర్తిగా మట్టిలో కలిసిపోతుంది. ‘యూత్ స్టెమ్ 2030’ పత్రికలో ప్రచురితమైన ఈ ప్రయోగానికి సంబంధించిన కథనం.. పర్యావరణ పరిరక్షణతో పాటు చేపల వ్యర్థాల సమస్యకు కూడా చక్కటి పరిష్కారాన్ని చూపిస్తోంది.
సాధారణంగా చేపలను విక్రయానికి సిద్ధం చేసే క్రమంలో దాదాపు 20% నుండి 80% వరకు ముళ్లు, ఈదే రెక్కలు, పొలుసులు వ్యర్థాలుగా మిగిలిపోతాయి. వీటిని సరైన రీతిలో పారవేయకపోవడం వల్ల పర్యావరణ కాలుష్యం పెరుగుతోంది. అయితే చేపల పొలుసుల్లో టైప్-1 కొల్లాజెన్, కాల్షియం లవణాలు అధికంగా ఉంటాయని గుర్తించిన పరిశోధకులు.. వాటిని ఉపయోగించి సన్నని, వంగే స్వభావం ఉన్న ట్రాన్స్పరెంట్ షీట్ను రూపొందించారు. పొలుసుల నుంచి సేకరించిన కొల్లాజెన్కు ‘చిటోసన్’ అనే పదార్థాన్ని కలిపి ‘స్క్లెరోటైజేషన్’ పద్ధతి ద్వారా ఆ షీట్ కు నీరు, వేడిని తట్టుకునే శక్తిని అందించారు. దీనికి ‘సైక్లో ప్లాస్ 2’గా పేరు పెట్టారు.
ఈ ‘సైక్లో ప్లాస్ 2’ షీట్లను శాస్త్రవేత్తలు వివిధ రకాలుగా పరీక్షించారు. ఇది సాధారణ ప్లాస్టిక్ లాగే గట్టిగా ఉంటూనే అధిక ఉష్ణోగ్రతలను కూడా సమర్థవంతంగా తట్టుకోగలదని తేలింది. సాధారణ ఎల్డిపిఈ (LDPE) ప్లాస్టిక్ కన్నా ఇది వేడికి తక్కువగా సంకోచిస్తోంది. దాదాపు 140°C నుండి 150°C ఉష్ణోగ్రత వద్ద కూడా తన స్వభావాన్ని కోల్పోకుండా కాంతిని స్పష్టంగా ప్రసరింపజేసే పారదర్శకతను ప్రదర్శించింది.
ఈ ఆవిష్కరణలో అత్యంత ముఖ్యమైన అంశం దీని బయోడిగ్రేడబుల్ స్వభావం. సాధారణ ప్లాస్టిక్ నేలలో కరిగిపోవడానికి వందలాది ఏళ్లు పడితే ఈ ‘సైక్లో ప్లాస్ 2’ మాత్రం నేలలో వేసిన రెండో వారం నుంచే క్షీణించడం ప్రారంభమై, ఎనిమిదో వారం పూర్తికాకముందే పూర్తిగా మట్టిలో కలిసిపోయింది. అంతేకాకుండా ఈ పదార్థం ఉన్న మట్టిలో మొక్కలు పెంచినప్పుడు అవి ఎలాంటి హానికర ప్రభావానికి గురికాలేదు. పైగా, సాధారణ మట్టి కంటే ఈ పదార్థం ఉన్న మట్టిలోనే మొక్కలు 3% నుండి 7% వేగంగా పెరగడం విశేషం.
Also Read: చెక్పై చివరన ‘ఓన్లీ’ (Only) ఎందుకు? ఇది RBI రూలా? లేక జస్ట్ అలవాటా?
షాపింగ్ బ్యాగులు, ప్యాకేజింగ్ మెటీరియల్స్, కంటైనర్లు, సింగిల్ యూజ్ ప్రొడక్టులకు ఈ కొత్త పదార్థం అద్భుతమైన ప్రత్యామ్నాయంగా మారనుందని పరిశోధకులు చెబుతున్నారు. వేస్ట్ 3D-ప్రింటెడ్ ప్లాస్టిక్తో ఈ కాంపోజిట్ను కలిపి తయారు చేసిన మరొక వెర్షన్ హోమ్ కంపోస్టింగ్ ప్రక్రియలో కూడా వేగంగా కరిగిపోతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. అయితే పచ్చి చేపల వ్యర్థాల నుంచి నేరుగా దీనిని వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేయడం, సముద్రపు నీటిలో దీని మన్నికను పరిశీలించడం వంటి మరికొన్ని పరీక్షలు పూర్తయితే ఇది త్వరలోనే మన నిత్యజీవితంలో అందుబాటులోకి రానుంది.
Also Read: సముద్రంపైనే అద్భుత వ్యవసాయం.. ఉప్పు నీటితో కూరగాయల సాగు.. అదరగొట్టేశారు కదయ్యా!