Floating Farm: భూమిపై మంచినీటి వనరులు వేగంగా తగ్గిపోతున్న నేపథ్యంలో శాస్త్రవేత్తలు ఒక సంచలనాత్మక ప్రయోగాన్ని విజయవంతం చేశారు. సూర్యరశ్మి సాయంతో సముద్రపు ఉప్పు నీటిని స్వచ్ఛమైన మంచినీటిగా మార్చి ఆ నీటితో పంటలు పండించే కొత్త ‘ఫ్లోటింగ్ ఫార్మ్’ (తేలియాడే పొలం) సాంకేతికతను అందుబాటులోకి తెచ్చారు. ఆస్ట్రేలియాలోని ‘యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా’ పరిశోధకులు అభివృద్ధి చేసిన ఈ వ్యవస్థ.. భవిష్యత్తులో ఆహార భద్రతకు సరికొత్త మార్గాన్ని చూపనుంది.
నీటిలో తేలియాడే పొలం కోసం ‘డబుల్ లేయర్డ్ వర్టికల్ సోలార్ సీ ఫార్మ్’ (DVSSF) గా పిలిచే పరికరాన్ని పరిశోధకులు అభివృద్ధి చేశారు. దీనిని రెండు అంచెలుగా రూపొందించారు. కింద ఉన్న గది సముద్రపు నీటిని స్వచ్ఛమైన నీటిగా మార్చడానికి ఉపయోగపడితే పైన ఉన్న గదిలో మట్టిని నింపి మొక్కలు పెంచుతారు. నీటి ఉపరితలంపై తేలియాడేందుకు వీలుగా ‘పాలిస్టైరీన్ ఫోమ్’ను వాడారు. కింది భాగంలో సూర్యరశ్మి వేడి ద్వారా ఉప్పు నీరు ఆవిరై, ఆవిరి చల్లబడి మంచి నీరుగా మారుతుంది. ఈ నీటిని పైన ఉన్న మట్టికి చేరవేసేందుకు ‘హైడ్రోఫిలిక్ బంబూ పేపర్ బెల్టుల’ను అమర్చారు. దీనివల్ల మొక్కలకు సముద్రపు నీరు నేరుగా తగలకుండా, కేవలం శుద్ధి చేసిన మంచినీరు మాత్రమే అందుతుంది.
ఈ తేలియాడే పొలంలో నిర్వహించిన మొదటి విడత ప్రయోగాల్లో బ్రోకోలీ, లెట్యూస్, పాక్ చోయ్ (ఒక రకమైన క్యాబేజీ) కూరగాయలను పండించారు. కృత్రిమ సముద్రపు నీటితో నింపిన పూల్లో నిర్వహించిన ఈ పరీక్షలలో మూడు రకాల విత్తనాలు 80 శాతానికి పైగా అంకురోత్పత్తి (germination) సాధించడం విశేషం. గ్రీన్ హౌస్ వాతావరణాన్ని ప్రతిబింబించేలా పైన పారదర్శక మూతను అమర్చడం వల్ల ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ లోపలి ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగానే నమోదైంది.
అయితే నీటి ఆవిరి వేగాన్ని పెంచడానికి శాస్త్రవేత్తలు రెడ్యూస్డ్ గ్రాఫేన్ ఆక్సైడ్, టాన్నిక్ యాసిడ్, కాటన్ సబ్స్ట్రేట్తో చేసిన ప్రత్యేక ఫోటోథర్మల్ పదార్థాన్ని ఉపయోగించారు. ఇది సూర్యరశ్మిని త్వరగా గ్రహించి వేడిగా మార్చింది. ఫలితంగా ప్రయోగ సమయంలో మట్టిలో తేమ శాతం సుమారు 20% వరకు స్థిరంగా కొనసాగింది. ఇతర సాధారణ పద్ధతుల్లో మట్టి త్వరగా ఎండిపోయి పగుళ్లు బారిన పడగా ఈ విధానం పంటలకు తగినంత తేమను నిరంతరం అందించింది.
Also Read: జియో మైండ్ బ్లోయింగ్ ప్లాన్స్.. రూ. 500 లోపే 15 ఓటీటీలు.. ఉచిత AI, క్లౌడ్ స్టోరేజ్!
భూమితో పనిలేకుండా కేవలం సముద్రాలు, ఉప్పునీటి సరస్సుల ఉపరితలంపైనే పంటలు పండించడానికి ఈ సాంకేతికత ఎంతగానో ఉపయోగపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. అయితే పెద్ద పెద్ద మొక్కలు పెరిగే కొద్దీ కింది భాగానికి సూర్యరశ్మి తగలకుండా అడ్డుపడే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. భవిష్యత్తులో మరింత చౌకైన పరికరాలు, మెరుగైన ఆటోమేషన్ ద్వారా ఈ వ్యవస్థను పెద్ద ఎత్తున వాణిజ్య వ్యవసాయానికి అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వివరించారు.
Also Read: సరస్సు ఒడ్డున కొలువైన రంగనాయక స్వామి.. ఇదే తెలంగాణ అపర శ్రీరంగం!