Bio Fuel: ఇరాన్ యుద్ధంలో చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందని ప్రచారం. అయితే జార్ఖండ్ రాంచీకి చెందిన విశాల్ గుప్తా.. చెరువులు, కాలువల్లోని నాచుతో బయో ఫ్యూయల్ తయారు చేస్తున్నారు. ఇది పెట్రోల్, డీజిల్ కంటే ఛీప్ కాగా.. పర్యావరణహితం కూడా. 48 ఏళ్ల విశాల్.. జార్ఖండ్ చెరువుల్లోని నాచుతో జీవ ఇంధనాన్ని ఆవిష్కరించారు. దీంతో తయారు చేసిన ఇంధనాన్ని ‘మోర్ మైలేజ్’ పేరిట సొంత పెట్రోల్ పంప్ను ఏర్పాటు చేసి తక్కువ ధరకు అందిస్తున్నారు.
ఈ బయో ఇథనాల్ పెట్రోల్ స్థానాన్ని భర్తీ చేయగలదని విశాల్ అంటున్నారు. సామాన్యుడికి తక్కువ ఖర్చుతో ఇంధనాన్ని అందించాలనే ఈ బయో ఫ్యూయల్ అభివృద్ధి చేశానని ఆయన చెప్పారు. తన తాత 1932లో బర్మా-షెల్ (భారత్ పెట్రోలియం)లో పనిచేశారని, తండ్రి 1969లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో డీలర్గా పనిచేశారన్నారు. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి డిగ్రీ పొందిన ఆయన ఇంధనాలపై పరిశోధన చేస్తున్నారు. గత 20 ఏళ్లుగా అనేక ఇతర ప్రభుత్వ రంగ సంస్థలతో కలిసి పనిచేస్తున్నారు.
విశాల్ గుప్తా సూక్ష్మ శైవలాలలో ప్రోటీన్లు, అమైనో యాసిడ్స్, ఖనిజాలు, ఇతర పోషకాలు సమృద్ధిగా ఉండటం వల్ల వాటిని పశువుల మేతగా ఉపయోగించడంపై పరిశోధన చేశారు. ఆ సమయంలోనే వీటిలో ముడి చమురులో ఉండే రసాయనాలను గుర్తించారు. దానిని బయోఫ్యూయల్ అభివృద్ధి చేయడానికి పరిశోధనలు చేశారు. భారత ప్రభుత్వం నుండి అనుమతి తీసుకుని తన సొంత గ్రామంలో పరిశోధనలు ప్రారంభించారు. ఈ పరిశోధన విజయవంతమై నాచు నుంచి బయో ప్యూయల్ ను తయారు చేశారు.
Also Read: ప్రపంచానికి ఆ 8 మార్గాలు చాలా కీలకం.. చమురు రవాణాలో అవే కీలకం, ఒక్కరోజు ఆగినా
చెరువులు, కాలువల్లో పెరిగే నాచును(ఆల్కే) తన నర్సరీలో పెంచుతారు. ఆ ఆల్గేను ఎండబెట్టి పొడిగా చేస్తారు. ఆ పొడిని చిన్న చిన్న కడ్డీల్లా చేస్తారు. ఈ కడ్డీలను బాయిలర్ లో వేసి, హెక్సెన్ కెమికల్ మిక్స్ చేసి 12 గంటల పాటు వేడి చేస్తారు. అప్పుడు ఓ లిక్విడ్ జనరేట్ అవుతుంది. దానిని రిఫైన్ చేసి బయో ఫ్యూయల్ గా ఉపయోగిస్తారు. ఈ ఫ్యూయల్ ను విశాల్ గుప్తా పలు సంస్థలకు సరఫరా చేస్తున్నారు.