Social Media Ban: నేటి డిజిటల్ యుగంలో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతీ ఒక్కరూ సోషల్ మీడియాకు బాగా అలవాటుపడిపోయారు. అయితే, పిల్లలు సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడపడం వారి మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకంపై పరిమితులు విధించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. దీనిపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి ఆఖరి నిర్ణయం తీసుకోనప్పటికీ.. ప్రస్తుతం పరిశీలన దశలోనే ఉంచింది.
పిల్లల డిజిటల్ భద్రత, వారి ఆరోగ్యంపై సోషల్ మీడియా చూపుతున్న నెగెటివ్ ప్రభావాన్ని అరికట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు కఠిన చట్టాలను తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా అడిక్టివ్ అల్గారిథమ్స్, సైబర్ బెదిరింపులు, అనుచితమైన కంటెంట్ నుంచి చిన్నపిల్లలను కాపాడేందుకు అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇతర దేశాలు తీసుకుంటున్న చర్యలను భారత్ కూడా నిశితంగా గమనిస్తోంది.
Also Read: మోటరోలా కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!
కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శి ఎస్. కృష్ణన్ మాట్లాడుతూ.. పిల్లల సోషల్ మీడియా వినియోగం అనేది కేవలం భారత్కే పరిమితమైన అంశం కాదని, ఇది ప్రపంచవ్యాప్త సమస్య అని పేర్కొన్నారు. వేర్వేరు దేశాలు ఈ సమస్యను ఎలా ఎదుర్కొంటున్నాయి? వారు తీసుకొచ్చిన నిబంధనలు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయో లోతుగా అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. యూరోపియన్ యూనియన్, ఇతర దేశాలతో జరిగిన చర్చల్లో కూడా ఈ అంశం ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది.
ఇప్పటికే కొన్ని దేశాలు పిల్లలపై సోషల్ మీడియా ఆంక్షల విషయంలో ముందుంజలో ఉన్నాయి. ఆస్ట్రేలియా 16 ఏళ్లలోపు పిల్లలపై సోషల్ మీడియా నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. యూఏఈ కూడా 15 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు సోషల్ మీడియాను పరిమితం చేసింది. బ్రిటన్ సైతం 16 ఏళ్లలోపు పిల్లల కోసం ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్, టిక్టాక్, ఎక్స్ వంటి ప్లాట్ఫామ్లపై ఆంక్షలు తెచ్చేందుకు సిద్ధమవుతోంది. అయితే వాట్సప్, సిగ్నల్ వంటి మెసేజింగ్ యాప్లకు దీని నుంచి మినహాయింపు ఉండవచ్చని సమాచారం.
మన దేశంలో కూడా పార్లమెంటరీ కమిటీలు, పలువురు నిపుణులు పిల్లల డిజిటల్ భద్రత కోసం కఠినమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో.. పిల్లలు, తల్లిదండ్రులు, సోషల్ మీడియా కంపెనీలపై పడే ప్రభావాన్ని అంచనా వేసిన తర్వాతే భారత ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. పిల్లలకు సురక్షితమైన ఆన్లైన్ వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ అడుగులు వేస్తోంది.
Also Read: గూగుల్ డ్రైవ్లో ఫైళ్లు వెతకలేక విసుగొస్తుందా? ఈ సూపర్ ట్రిక్స్ వాడితే క్షణాల్లో పని పూర్తి!