Harish Rao Blasts Minister Ponguleti: రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష నేత, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగాపూర్ గ్రామంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. “పొంగులేటి కాదు, ఆయన ఒక పొగరులేటి, బాంబులూటీ.. అవినీతి బాగోతం బట్టబయలు అయ్యేసరికి డిఫెన్స్ లో పడి బూతులు తిడుతూ పిట్ట కథలు చెబుతున్నారు.” అని ధ్వజమెత్తారు. తన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి పొంగులేటి సచివాలయం వంటి పవిత్రమైన చోట నిలబడి అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
పొంగులేటి శ్రీనివాస రెడ్డి తన వ్యాఖ్యల ద్వారా కేవలం తన అవినీతినే కాకుండా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు సహా మంత్రులందరూ అవినీతిపరులేనని పరోక్షంగా ఒప్పుకున్నారని హరీష్ రావు ఆరోపించారు. రాష్ట్రంలోని అవినీతి కుంభకోణాల చిట్టాను ఆయనే చదివి అందరినీ కలుపుకున్నారని ఎద్దేవా చేశారు. రాఘవ కన్స్ట్రక్షన్లో అవినీతి జరిగిందని, వారు ఫైన్ కూడా కట్టారని స్వయంగా ముఖ్యమంత్రే అసెంబ్లీలో చెప్పారని, మరి ఇప్పుడు సంబంధం లేదని పొంగులేటి ఎలా బుకాయిస్తారని ప్రశ్నించారు. మైనింగ్, రెవెన్యూ, పిసిబి అధికారులు ఇల్లీగల్ మైనింగ్ అని నిర్ధారించినా మంత్రి అబద్ధాలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు.
నాదుర్ గుల్ భూములను కాపాడింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని హరీష్ రావు స్పష్టం చేశారు. ఆ భూములను నిషేధిత జాబితాలో పెట్టి, హైకోర్టులో పోరాడి, సీలింగ్ భూములు అమ్మిన వారిపై చర్యలు తీసుకునేలా ఆర్డర్స్ తెచ్చింది తామేనని గుర్తు చేశారు. ఒకవేళ అవి ప్రభుత్వ భూములే అయితే, గత రెండున్నర ఏళ్లుగా ప్రభుత్వం ఎందుకు స్వాధీనం చేసుకోలేదని నిలదీశారు. అక్కడ రోజుకొక కంపెనీ బోర్డు ఎందుకు మారుతోందని, శిల్ప ఇన్ఫ్రా వంటి సంస్థలతో రాఘవ కంపెనీకి సంబంధాలు ఉన్నాయో లేవో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. “ప్రభుత్వ భూములే అయితే అక్కడ హైడ్రా (HYDRAA) గడ్డి పీకుతుందా?” అని ఘాటుగా ప్రశ్నించారు.
మంత్రి పొంగులేటికి నిజాయితీ ఉంటే వెంటనే ఆ అక్రమ కట్టడాలపై హైడ్రాను పంపి చర్యలు తీసుకోవాలని హరీష్ రావు సవాల్ విసిరారు. అధికారులు నోటీసులు ఇచ్చిన కాపీలను తాను అసెంబ్లీలోనే చూపించానని, వాటిని మంత్రి ఉద్యోగులే రిసీవ్ చేసుకున్నారని గుర్తు చేశారు. పొంగులేటి బాంబులన్నీ ‘తుస్సు’మన్నాయని, ఆయన చిట్టా ఇంకా చాలా ఉందని హెచ్చరించారు. ఇప్పటికైనా పొగరు తగ్గించుకుని, చేసిన తప్పును ఒప్పుకొని ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
Read Also: అది బీసీల పార్టీ కాదు.. ఓసీల పార్టీ! కవిత పార్టీ పెట్టకముందే మల్లన్న పార్టీ మాటల దాడి!