IIT Delhi: వేల రూపాయలు కరెంటు బిల్లు కట్టలేక ఇబ్బంది పడుతున్న ఏసీ వినియోగదారులకు ఐఐటీ ఢిల్లీ పరిశోధకుల బృందం తీపి కబురు చెప్పింది. విద్యుత్ బిల్లుల భారాన్ని గణనీయంగా తగ్గించే సరికొత్త ఎయిర్ కండీషనర్ టెక్నాలజీని వారు రూపొందిస్తున్నారు. ప్రస్తుతం వాడుతున్న ఏసీల కంటే ఇది దాదాపు మూడో వంతు తక్కువ విద్యుత్తును వాడుకుంటూనే మెరుగైన చల్లదనాన్ని అందిస్తుంది.
రోజురోజుకీ ఎండల తీవ్రత పెరగడం వల్ల ఆరోగ్యంపై ప్రభావం పడటమే కాకుండా పని సామర్థ్యం కూడా తగ్గుతోంది. 2019 నాటి ఇండియా కూలింగ్ యాక్షన్ ప్లాన్ నివేదిక ప్రకారం, 2037-38 నాటికి మన దేశంలో కూలింగ్ అవసరాల కోసం వాడే విద్యుత్ వినియోగం మూడు రెట్లు పెరిగే అవకాశం ఉంది. ఇది సహజ వనరులపై ఒత్తిడి పెంచడమే కాకుండా సామాన్యుల జేబులకు చిల్లు పడేలా చేస్తుంది. ఈ సమస్యకు పరిష్కారంగా ఐఐటీ ఢిల్లీకి చెందిన ప్రొఫెసర్ అనురాగ్ గోయల్ బృందం ఈ కొత్త ఏసీ ప్రోటోటైప్ను సిద్ధం చేసింది.
Also Read: ఏంటి భయ్యా నిజమా.. రూ.25వేల లోపే బ్రాండెడ్ స్ప్లిట్ ఏసీలా? డోంట్ మిస్!
సాధారణ ఏసీలు గాలిలోని తేమను తొలగించే క్రమంలో గాలిని విపరీతంగా చల్లబరుస్తాయి. దీనివల్ల ఎక్కువ కరెంటు ఖర్చవుతుంది. కానీ ఐఐటీ ఢిల్లీ పరిశోధకులు రూపొందించిన సిస్టమ్లో ఒక ప్రత్యేకమైన మాడ్యూల్ ఉంటుంది. ఇది లిక్విడ్ డెసికాంట్ అనే ఉప్పు ద్రావణాన్ని ఉపయోగించి గాలిలోని తేమను నేరుగా గ్రహిస్తుంది. దీనిలో ఉండే పాలిమర్ మెంబ్రేన్ వల్ల ఆ ఉప్పు కణాలు గాలిలోకి రాకుండా అడ్డుకోవచ్చు.
ఈ విధానంలో తేమను పీల్చుకున్న ఉప్పు ద్రావణం మళ్లీ పొడిగా మారాలి. దీని కోసం విడిగా హీటర్లు వాడకుండా, ఏసీ కండెన్సర్ నుండి బయటకు వచ్చే వేడి గాలినే వాడుకుంటుంది. ఇలా వ్యర్థమయ్యే వేడిని తిరిగి వినియోగించుకోవడం వల్ల విద్యుత్ ఆదా అవుతుంది.
ఈ హైబ్రిడ్ ఏసీ వల్ల సగటున 33 శాతం వరకు విద్యుత్ ఆదా అవుతుందని పరిశోధకులు చెబుతున్నారు. వాతావరణాన్ని బట్టి ఈ సేవింగ్ 28 శాతం నుండి 41.5 శాతం వరకు ఉండొచ్చు. ఈ కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తే భవిష్యత్తులో ఇళ్లలో, ఆఫీసుల్లో విద్యుత్ బిల్లుల భయం లేకుండా ఏసీలను వాడుకోవచ్చు.
Also Read: షావోమీ కొత్త సరుకు.. ఫోన్తోనే ఆపరేట్ చేయొచ్చు, కరెంటు బిల్లు కూడా తక్కువే!