Mitticool Fridge: సాధారణంగా రిఫ్రిజిరేటర్లు కరెంటుతో పనిచేస్తాయి. కాబట్టి నెల చివరకూ వచ్చేసరికి విద్యుత్ బిల్లు పెరిగిపోతోందని వినియోగదారులు వాపోతుంటారు. అయితే గుజరాత్ కు చెందిన మన్సుఖ్ భాయ్ ప్రజాపతి (Mansukhbhai Prajapati) అనే వ్యక్తి.. అసలు కరెంటు అవసరం లేని మట్టి ఫ్రిడ్జ్ ను తయారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. దీనికి ‘మిట్టి కూల్’ (Mitticool) అని పేరు సైతం పెట్టారు. దీని తయారీ నేపథ్యం? ఇది ఏ విధంగా పనిచేస్తుంది? దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఈ కథనంలో పరిశీలిద్దాం.
గుజరాత్ కు చెందిన మన్సుఖ్ భాయ్ ఒక సాధారణ కుమ్మరి. 2001లో సంభవించిన భారీ భూకంపం వల్ల ఎంతోమంది పేదలు తమ ఇళ్లను, వస్తువులను కోల్పోయారు. ఆ సమయంలో ఓ పత్రికలో వచ్చిన పత్రిక.. మిట్టి కూల్ అనే ఆవిష్కరణకు కారణమైందని మన్సుఖ్ తెలిపారు. సదరు పత్రికలో పగిలిపోయిన ఒక మట్టి కుండను చూపిస్తూ.. ‘పేదవాడి ఫ్రిడ్జ్ పగిలిపోయింది’ అనే శీర్షికతో వార్తను ప్రచురించారు. అది చూసిన మన్సుఖ్ భాయ్.. నిజంగానే పేదవారికి అందుబాటులో ఉండేలా మట్టితోనే ఒక ఫ్రిజ్ను ఎందుకు తయారుచేయకూడదని ఆలోచించారు. దాదాపు నాలుగేళ్లు కష్టపడి ఈ ‘మిట్టికూల్’ను రూపొందించారు.
సాధారణ ఫ్రిజ్లు కరెంటుతో నడిస్తే.. ఇది ‘బాష్పీభవనం’ (Evaporative Cooling) అనే సహజ సిద్ధమైన సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. ఈ ఫ్రిజ్ పైన ఒక నీటి ట్యాంక్ ను మన్సుఖ్ ఫిక్స్ చేశారు. ట్యాంక్ లోని నీరు ఫ్రిజ్ గోడల ద్వారా నెమ్మదిగా లోపలికి చేరుతుంది. ఈ నీరు ఆవిరి అయ్యే క్రమంలో లోపల ఉన్న వేడిని గ్రహించి.. లోపలి భాగాన్ని చల్లగా మారుస్తుంది. ఫలితంగా బయటి ఉష్ణోగ్రత కంటే లోపల సుమారు 8°C నుండి 10°C వరకు తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది.
మిట్టి కూల్ ను ఇంట్లో పెట్టుకోవడం వల్ల.. పవర్ బిల్లు సమస్య ఉండదు. పర్యావరణానికి కూడా ఇది మేలు చేస్తుంది. మిట్టికూల్ ఫ్రిడ్జ్ లో పెట్టిన కూరగాయాలు, పండ్లు సుమారు 5 నుండి 7 రోజుల వరకు తాజాగా ఉంటాయని మన్సుఖ్ భాయ్ తెలిపారు. పాలు కూడా రెండు రోజుల వరకు పాడవకుండా నిల్వ ఉంటాయని పేర్కొన్నారు. దీనిలో ప్లాస్టిక్ లేదా గ్యాస్ వాడకం లేకపోవడం వల్ల ఆహార పదార్థాల తమ సహజ రుచిని కోల్పోకుండా ఉంటాయి.
Also Read: సంచలన కేసు.. భర్తపై భార్య లైంగికదాడి.. మరో మహిళతోనూ కలవమని బలవంతం!
మిట్టికూల్ పేరుతో ప్రత్యేక వెబ్ సైట్ ను ఏర్పాటు చేసి.. మన్సుఖ్ భాయ్ మట్టి ఫ్రిడ్జ్ లను విక్రయిస్తున్నారు. 50 లీటర్ల సామర్థ్యం కలిగిన ఫ్రిడ్జ్ ను రూ.8000కు అందిస్తున్నారు. ఇందులో కూరగాయాలు, పండ్లు భద్రపరుచుకోవడం కోసం రెండు షెల్ఫ్ లు ఉన్నాయి. పై భాగంలో నీరు పోసేందుకు ట్యాంకర్ లాంటి నిర్మాణం ఉంది. మరోవైపు మన్సుఖ్ భాయ్ కృషిని గుర్తించిన ఫోర్బ్స్ పత్రిక.. 2010లో ఆయన్ను టాప్ రూరల్ ఎంటర్ ప్రెన్యూర్స్ జాబితాలో చేర్చింది. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అప్పట్లో ఈ మిట్టికూల్ ఆవిష్కరణపై ప్రశంసలు కురిపించారు.