Woman Assaulted: మహిళలపై నిత్యం ఎక్కడో ఒకచోట అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నా, కామాంధుల్లో మార్పు రాకపోగా వారి తెగింపు పరాకాష్టకు చేరుతోంది. తాజాగా సభ్య సమాజం తలదించుకునే మరో అమానుష ఘటన బీహార్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. తాజాగా నలంద జిల్లాలో ఒక మహిళపై నడిరోడ్డుపై జరిగిన సామూహిక అత్యాచార యత్నం, ఆమెను వివస్త్రను చేసిన ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.
బీహార్లోని నలంద జిల్లాలో ఒక బాధిత మహిళ స్థానిక మార్కెట్కు వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా, ముగ్గురు దుర్మార్గులు ఆమెను అడ్డుకున్నారు. నడిరోడ్డుపైనే ఆమెను చుట్టుముట్టి బలవంతం చేసేందుకు ప్రయత్నించారు. ఆమె ప్రతిఘటించడంతో ఆగ్రహించిన ఆ కామాంధులు, ఆమె బట్టలు చించేశారు. అంతటితో ఆగకుండా, ఆమె ప్రైవేట్ భాగాలను తాకుతూ అత్యంత దారుణంగా హింసించారు.
ఈ ఘోరం జరిగిన వెంటనే ధైర్యంగా పోలీస్ స్టేషన్కు వెళ్లిన బాధితురాలు ముగ్గురు వ్యక్తులపై ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. వైరల్ అయిన వీడియో ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు, ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేశారు. అయితే ప్రధాన నిందితుడు తప్పించుకుని ఢిల్లీకి పరారైనట్లు సమాచారం అందడంతో, బీహార్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఢిల్లీకి పంపారు. అతడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మహిళా భద్రతపై కఠిన చట్టాలు ఉన్నప్పటికీ, అమలులో లోపాలు ఇలాంటి ఘటనలకు కారణమవుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి.
నలంద జిల్లాలో జరిగిన ఈ అమానుష ఘటనపై బీహార్లో రాజకీయ రగడ మొదలైంది. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీయే (NDA) కూటమి ప్రభుత్వంపై ప్రతిపక్షాలు నిప్పులు చెరుగుతున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, మహిళలకు రక్షణ కరువైందని ఆర్జేడీ వంటి పార్టీలు విమర్శిస్తున్నాయి. నిందితులకు అధికార పార్టీ అండదండలు ఉన్నాయని, అందుకే ఇంత సాహసానికి ఒడిగట్టారని ఆరోపిస్తున్నాయి. మరోవైపు, నేరగాళ్లను వదిలే ప్రసక్తే లేదని, వారికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కఠిన శిక్ష పడేలా చూస్తామని ప్రభుత్వం హామీ ఇస్తోంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. “మహిళలు పగటిపూట కూడా ఒంటరిగా తిరగలేని పరిస్థితి ఉంటే మనం ఏ కాలంలో ఉన్నాం?” అని ప్రశ్నిస్తున్నారు. కేవలం అరెస్టులు సరిపోవని, ఇలాంటి మృగాళ్లకు బహిరంగంగా కఠిన శిక్షలు విధిస్తేనే భయం ఉంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. నలంద శీతలా మాత ఆలయ తొక్కిసలాట ఘటన నుండి తేరుకోకముందే, జిల్లాలో ఈ అఘాయిత్యం వెలుగుచూడటం స్థానికులను మరింత ఆవేదనకు గురిచేస్తోంది. Video
Read Also: సంచలన కేసు.. భర్తపై భార్య లైంగికదాడి.. మరో మహిళతోనూ కలవమని బలవంతం!