దోమలు చిన్న జీవులే. కానీ, అవి తెచ్చే వ్యాధుల జాబితా మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. అవి తలచుకుంటే మనుషుల ప్రాణాలు కూడా తీసేయగలవు. అయితే, దోమలు ఒకప్పుడు మనుషులను కుట్టేవి కావట. అసలు వాటికి మనుషుల రక్తం టేస్ట్ ఎలా ఉంటుందో కూడా తెలియదట. సుమారు 2 మిలియన్ ఏళ్ల కిందట.. ఫస్ట్ టైమ్ అవి మనిషి రక్తాన్ని తాగాయట. మిగతా జీవుల కంటే మనుషుల రక్తం ఎక్కువ రుచిగా ఉంటుందో ఏమో.. అప్పటి నుంచి అవి మనుషుల రక్తాన్ని పీల్చడం మొదలుపెట్టాయి. మరి అంతకు ముందు ఏం చేసేవనేగా మీ డౌట్?
ఇటీవల పరిశోధకులు నార్త్ ఇస్ట్ ఇండియా, ఆగ్నేయాసియాల్లోని దోమలపై పరిశోధనలు జరిపారు. వాటి జన్యువులను అధ్యయనంగా చేయగా పలు కీలక విషయాలు తెలిశాయి. ముందుగా.. మలేరియాను వ్యాప్తి చేసే అనాఫిలిస్ జాతికి చెందిన దోమలే.. మనిషి రక్తాన్ని టేస్ట్ చేశాయట. అప్పటి నుంచి అవి మనుషులతో కలిసి జీవించడం మొదలుపెట్టాయి. సుమారు 2 మిలియన్ ఏళ్ల నుంచి అవి మనతోనే కలిసి ఉంటూ.. మానవ రక్తాన్ని ఎంజాయ్ చేస్తూ.. తమ తర్వాతి తరాలకు కూడా వారసత్వాన్ని అందించాయి. మనుషుల్లోని పోషకాలను బాగా గ్రహించి.. అవి తమ జాతిని బాగా డెవలప్ చేసుకున్నాయి.
వాస్తవానికి దోమలు.. మలయ్, సుమత్ర, జావా, బోర్నియోలో ఎక్కువగా ఉండేవట. ఈ అధ్యయనానికి నాయకత్వం వహించిన అమెరికాలోని వాండర్ బిల్ట్ యూనివర్శిటీ జీవశాస్త్రవేత్త, పోస్ట్డాక్టోరల్ పరిశోధకురాలు ఉపాసన సింగ్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘‘ఒకప్పుడు దోమలు తమ ఉనికి కోసం మనుషులపై ఆధారపడేవి కాదు. వాటికవే స్వతంత్రంగా జీవించేవి. అవి నివసించే ప్రాంతాల్లో మనుషులు నివాసాలు ఏర్పాటు చేసుకున్న రోజు నుంచి అవి.. రక్తాన్ని తాగడం అలవాటు చేసుకున్నాయి’’ అని తెలిపారు. అయితే, ఏడిస్, ఈజిప్టి, క్యూలెక్స్ పైపియన్స్ జాతికి చెందిన దోమలు మాత్రం చాలా ఆలస్యంగా మనుషుల రక్తాన్ని రుచి చూసినట్లు ఆమె పేర్కొన్నారు. అవి సుమారు 10 వేల సంత్సరాల కిందటి నుంచి మనుషుల రక్తాన్ని తాగుతున్నట్లు పేర్కొన్నారు.
అప్పట్లో హోమో ఎరెక్టస్ అనే పురాతన మానవ జాతి ఉండేది. వాళ్లు ఇప్పుడు మనం ఉన్నట్లుగా ఉండేవారు కాదు. వారు చాలా భిన్నంగా ఉండేవారు. మలేషియా, ఇండోనేషియా వంటి దేశాల్లో వీరు ఎక్కువ నివసించేవారు. ముందుగా దోమ కాటుకు గురైంది ఈ మానవ జాతే. మనుషుల రక్తాన్ని టేస్ట్ చేయడానికి ముందు దోమలు చెట్లపై ఎక్కువగా నివసించే కోతులు తదితర జంతువుల రక్తాన్ని తాగేవట. ఆ తర్వాత భూమి మీద నివసించే జంతువుల రక్తాన్ని తాగడం మొదలుపెట్టాయట. అలా అవి మనుషులకు కూడా దగ్గరయ్యాయి. కాలక్రమేనా జంతువుల కంటే మనుషుల సంఖ్య పెరగడం, వాళ్ల రక్తాన్ని రుచిమరగడం వల్ల.. ఫుల్ టైమ్ ఆహారంగా మార్చుకున్నాయి. అప్పటి నుంచి జనాలకు మలేరియా వంటి భయానక వ్యాధులు రావడం మొదలైంది. ఇప్పుడు ఈ వ్యాధి ప్రపంచాన్నే వణికిస్తోంది.
దోమలు సుమారు 200 మిలియన్ ఏళ్ల కిందటే ఉద్భవించాయి. అంటే మానవ జాతి ఏర్పడటానికి ముందు నుంచే భూమిపై ఉనికిలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 3,500 దోమ జాతులు ఉన్నాయి. వీటిలో కేవలం ఒకటి నుంచి రెండు శాతం దోమ జాతులు మాత్రమే మనుషుల రక్తాన్ని తాగుతాయని పరిశోధకులు తెలిపారు. మలేరియా వాకమైన అనోఫిలెస్ దోమలు.. మలయ్, బోర్నియా, సుమత్రా, జావా ప్రాంతాల్లోని కోతులు, కొండముచ్చుల రక్తాన్ని తాగుతూ జీవించేవని పేర్కొన్నారు. మన పూర్వీకులు హోమో ఎరెక్టస్ అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకున్న రోజు నుంచి దోమలు మానవ రక్తాన్ని తాగడం మొదలుపెట్టాయని వెల్లడించారు. ముందుగా అవి మనుషుల నుంచి వచ్చే వాసనను ఇష్టపడ్డాయని, ఆ తర్వాతే రక్తాన్ని రుచి చూశాయని తెలిపారు.
దోమలు.. మనుషుల రక్తానికి అలవాటు పడి ఉండకపోతే.. ఎంతో మంది మనుషులు ఇప్పటికీ ఆరోగ్యంగా జీవించేవారు. దోమల వల్ల ప్రపంచవ్యాప్తంగా 249 మిలియన్ మంది వివిధ రోగాలతో బాధపడుతున్నారు. కేవలం మలేరియా వల్లే 6,08,000 మంది చనిపోయారంటే.. దోమలు ఎంత డేంజరో అర్థం చేసుకోవచ్చు. దోమ కాటు వల్ల ఇంకా డెంగ్యూ, చికున్గున్యా, జపనీస్ ఎన్సెఫాలిటిస్ , వెస్ట్ నైలు వంటి ఎన్నో ప్రమాదకర వ్యాధులకు గురవ్వుతున్నారు. కాబట్టి.. దోమలతో జాగ్రత్త.
Also Read: డైనోసార్లు గురించి మనం ‘విన్నది’ అబద్దమా? ఆ సినిమాలు మనల్ని మోసం చేశాయా?