Python Blood Research: మనం అప్పుడప్పుడూ చూసే ఉంటాం.. ఏదైనా పెద్ద జంతువును కొండచిలువ మింగినప్పుడు ఏటూ కదలకుండా ఒకేచోట పడుకుని వింతగా ప్రవర్తిస్తుంటుంది. అయితే ఈ కొండచిలువలు నెలల తరబడి ఏమీ తినకుండా ఉండగలవు. కానీ ఒక్కసారి ఆహారం దొరికితే మాత్రం తమ శరీరం కంటే పెద్ద జంతువులను కూడా అమాంతం మింగేస్తాయి. అలా ఏదైనా పెద్ద సైజు జంతువులను మింగినప్పుడు వాటి శరీరంలో విపరీతమైన మార్పులు వస్తాయట. ఈ వింత ప్రక్రియ వెనుక ఉన్న రహస్యాన్ని తాజాగా శాస్త్రవేత్తలు ఛేదించారు. అదే ఇప్పుడు ఊబకాయం, అధిక బరువు సమస్యతో బాధపడేవారికి చికిత్సలా మారనుంది. అదెలాగో తెలుసుకుందాం పదండి..
సాధారణంగా అధిక బరువు తగ్గడానికి ప్రస్తుతం మార్కెట్లో ఓజెంపిక్ వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇవి బరువు తగ్గించినా, వాంతులు, కడుపులో తిప్పడం వంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తుంటాయి. కానీ కొండచిలువ రక్తంలో ఉండే ‘పారా-టైరామైన్-ఓ-సల్ఫేట్’ (pTOS) అనే ఒక ప్రత్యేకమైన పదార్థం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆకలిని తగ్గిస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. కొండచిలువలు ఆహారం తీసుకున్న తర్వాత వాటి రక్తంలో ఈ రసాయనం దాదాపు వెయ్యి రెట్లు పెరుగుతుంది. ఇది నేరుగా మెదడుకు ‘ఇక కడుపు నిండిపోయింది, చాలు’ అనే సంకేతాన్ని పంపిస్తుంది. అంటే.. బలవంతంగా కాకుండా సహజంగానే మన ఆహారపు అలవాట్లను ఇది నియంత్రిస్తుందన్నమాట.
Also Read: ఇంటర్నెట్ లేకపోయినా.. అత్యవసర పరిస్థితుల్లో ఆదుకొనే ఎమర్జెన్సీ యాప్స్, మ్యాప్తో సహా అన్నీ!
పరిశోధకులు ఈ పదార్థాన్ని ఎలుకలపై ప్రయోగించి చూసినప్పుడు ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చాయి. సాధారణ ఎలుకలతో పాటు బాగా బరువున్న ఎలుకలకు కూడా దీన్ని ఇచ్చినప్పుడు, అవి తమ ఆహారం తీసుకోవడం తగ్గించి, క్రమంగా బరువు తగ్గాయి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే.. బరువు తగ్గించే ఇతర మందులు వాడినప్పుడు కండరాలు కరిగిపోవడం, నీరసం రావడం వంటి సమస్యలు ఉంటాయి. కానీ ఈ కొండచిలువ రసాయనం వల్ల అలాంటి ఇబ్బందులేవీ కలగలేదు. ఇది నేరుగా మెదడులోని ఆకలిని నియంత్రించే భాగంపై ప్రభావం చూపి, అతిగా తినాలనే కోరికను సహజంగానే అణిచివేస్తుంది.
ప్రస్తుతానికి ఈ పరిశోధన ప్రాథమిక దశలోనే ఉంది. కొండచిలువల్లో ఉండే ఈ అద్భుతమైన జీవక్రియలను మనుషులపై ఎలా ప్రయోగించాలనే దానిపై ఇంకా లోతైన అధ్యయనాలు జరగాల్సి ఉంది. ప్రకృతిలో ఉండే ఇలాంటి వింతైన జీవుల శరీరతత్వాన్ని అర్థం చేసుకోవడం ద్వారా, భవిష్యత్తులో సైడ్ ఎఫెక్ట్స్ లేని బరువు తగ్గించే మందులను తయారు చేయవచ్చని శాస్త్రవేత్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే కొండచిలువ రక్తంలోని ఈ రసాయనం మనుషుల ఆరోగ్య సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించబోతోందన్నమాట.
Also Read: పాత ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే చాలు.. Wi-Fi స్పీడ్ను పెంచుకోవచ్చు, అదెలాగంటే?