UPI Security: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డిజిటల్ చెల్లింపుల భద్రతను మరింత కఠినతరం చేసే దిశగా అడుగులు వేస్తోంది. సైబర్ మోసాల బారిన పడకుండా సామాన్య వినియోగదారులను రక్షించేందుకు “వన్ అవర్ పాజ్” (One-Hour Pause) అనే సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. దీంతో తొందర పడి డబ్బు పంపించిన వారు అది నిజమైన లావాదేవీలు కానప్పుడు వాటిని వెనక్కి తీసుకనే సౌకర్యం ఉంటుంది. దీంతో సైబర్ నేరాల సంఖ్య తగ్గవచ్చు.
భారతదేశంలో యూపీఐ (UPI) లావాదేవీలు పెరగడంతో పాటు, డిజిటల్ మోసాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా పెద్ద మొత్తంలో డబ్బులను నిమిషాల వ్యవధిలో దోచుకుంటున్న కేటుగాళ్లకు అడ్డుకట్ట వేసేందుకు ఆర్బీఐ ఒక గంట నిరీక్షణ సమయాన్ని ప్రతిపాదించింది.
ఈ ప్రతిపాదన ప్రకారం, ఒక వినియోగదారుడు రూ.10,000 కంటే ఎక్కువ మొత్తాన్ని ఎవరికైనా పంపినప్పుడు, ఆ లావాదేవీ పూర్తి కావడానికి ఒక గంట సమయం పడుతుంది. ఈ ఒక గంట వ్యవధిని ‘కూలింగ్ పీరియడ్’ అని పిలుస్తారు. ఈ లోపు సదరు వ్యక్తికి లావాదేవీకి సంబంధించిన నోటిఫికేషన్ వెళ్తుంది. ఒకవేళ అది పొరపాటున చేసినా లేదా మోసపూరితమైనదని గ్రహించినా, ఆ గంట లోపు లావాదేవీని రద్దు చేసే అవకాశం వినియోగదారుడికి ఉంటుంది.
సైబర్ నేరగాళ్లు తరచుగా బాధితులపై మానసిక ఒత్తిడి తెచ్చి, అత్యవసరం అని నమ్మించి తక్కువ సమయంలో పెద్ద మొత్తంలో డబ్బులు బదిలీ చేయించుకుంటారు. ఒక్కసారి డబ్బు డెబిట్ అయ్యాక, వారు దానిని వేర్వేరు ఖాతాల్లోకి మళ్లించి నిమిషాల్లో మాయం చేస్తారు. ఈ గంట సమయం బాధితుడికి ఆలోచించుకోవడానికి, అలాగే ఏదైనా అనుమానం వస్తే ఫిర్యాదు చేయడానికి ఉపయోగపడుతుంది.
కిల్ స్విచ్ (Kill Switch): మొబైల్ లేదా యాప్ హ్యాక్ అయినట్లు అనుమానం వస్తే, ఒకే క్లిక్తో యూజర్ తన బ్యాంక్ ఖాతాకు సంబంధించిన అన్ని డిజిటల్ సేవలను తక్షణమే నిలిపివేసే సదుపాయం.
అదనపు భద్రత: ఏప్రిల్ 1, 2026 నుండి అన్ని డిజిటల్ లావాదేవీలకు కనీసం రెండు రకాల సెక్యూరిటీ ప్రమాణాలు ఉండాలి. కేవలం పిన్ మాత్రమే కాకుండా బయోమెట్రిక్, ఓటీపీ వంటి అదనపు భద్రత తప్పనిసరి కానుంది.
సీనియర్ సిటిజన్ల కోసం: 70 ఏళ్లు పైబడిన వారు పెద్ద మొత్తంలో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు, వారి కుటుంబ సభ్యులు లేదా వారు ఎంచుకున్న నమ్మదగిన వ్యక్తి ఆమోదం తెలిపితేనే లావాదేవీ పూర్తయ్యేలా ప్రత్యేక చర్యలు.
Read also-ప్రదీప్ రంగనాధన్ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ ఎలా ఉందంటే.. ఫుల్ రివ్యూ..
ఆర్బీఐ ప్రతిపాదించిన ఈ నిర్ణయాలు డిజిటల్ బ్యాంకింగ్ రంగంలో భద్రతను మరో మెట్టు ఎక్కిస్తాయి. వేగంగా జరిగే లావాదేవీలకు ఇది కొంత ఆటంకంలా అనిపించినా, కష్టపడి సంపాదించిన సొమ్ము భద్రంగా ఉండటమే ముఖ్యమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మే 8, 2026 వరకు దీనిపై ప్రజల, ఇతర భాగస్వాముల అభిప్రాయాలను స్వీకరించిన అనంతరం ప్రభుత్వం దీనిని చట్టబద్ధం చేయనుంది. ఇది గనుక చట్ట బద్దత అయితే డిజిటల్ మోసాలు దాదాపు కట్టడి అవుతాయి.