Turkey Green Technology: సాధారణంగా మెుక్కలు పెంచాలంటే మట్టి నేల లేదా కుండి తప్పనిసరి. అందులో విత్తనాలు నాటి.. నిత్యం నీరు పోస్తే అవి ముందు మెుక్కలు, ఆ తర్వాత చెట్లుగా రూపాంతరం చెందుతాయి. అయితే ఇందుకు భిన్నంగా నిలువుగా ఉండే కాంక్రీట్ గోడలపై మెుక్కలు పెంచడం గురించి ఎప్పుడైనా విన్నారా? అది కూడా ఎలాంటి కుండి లేకుండా కేవలం స్టిక్కర్ తో మెుక్కలు పెరుగుతాయని ఎప్పుడైనా ఊహించగలరా? కానీ ఇదే చేసి చూపించారు టర్కీకి చెందిన పరిశోధకులు. ఈ సరికొత్త ఆవిష్కరణ గురించి ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
నగరాలు విస్తరిస్తున్న కొద్దీ చెట్లు నశించి.. కాంక్రీట్ జంగిళ్లుగా మారుతున్నాయి. ఇలాంటి తరుణంలో టర్కీ శాస్త్రవేత్తలు ఒక వినూత్న పరిష్కారాన్ని కనుగొన్నారు. ఇస్తాంబుల్ లోని బహెసెహిర్ యూనివర్శిటీకి చెందిన యాసెమిన్ కీయిఫ్ అనే శాస్త్రవేత్త ఈ సరికొత్త సాంకేతికతను అభివృద్ధి చేశారు. ఆయన బృందం ఈ ప్రాజెక్ట్ కు ‘గ్రీన్ అనార్కీ’ అనే పేరును పెట్టింది. ఈ కొత్త సాంకేతికతతో ఎలాంటి శ్రమ లేకుండా.. కేవలం ఒక స్టిక్కర్ సాయంతో నిలువు గోడలను (vertical walls) పచ్చటి వనాలుగా మార్చేయవచ్చు.
టర్కీ ఆవిష్కరించిన ఈ సాంకేతికత.. చూడటానికి సాధారణ గోడ స్టిక్కర్లా లేదా వాల్పేపర్లా కనిపిస్తుంది. కానీ దీని వెనుక అధునాతన బయో టెక్నాలజీ దాగి ఉంది. ఈ అంటుకునే పదార్థంలోనే మొక్కలు పెరగడానికి కావలసిన పోషకాలు, విత్తనాలు, తగినంత తేమను పట్టి ఉంచే ప్రత్యేకమైన జెల్ లాంటి పొరలు ఉంటాయి. దీన్ని గోడకు అంటించి కొద్దిగా నీరు అందిస్తే చాలు.. కొద్ది రోజుల్లోనే విత్తనాలు మొలకెత్తి, గోడ మొత్తం పచ్చదనంతో నిండిపోతుంది.
ఈ బయో స్టిక్కర్ కేవలం అందం కోసమే కాకుండా.. నగరాల్లో పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించడానికి కూడా ఎంతగానో దోహదపడుతుందని పరిశోధకులు అంటున్నారు. గోడలపై పెరిగే ఈ మొక్కలు గాలిలోని కార్బన్ డై ఆక్సైడ్ను పీల్చుకుని, ఆక్సిజన్ను విడుదల చేస్తాయని స్పష్టం చేస్తున్నారు. కాంక్రీట్ గోడలు వేడిని ఎక్కువగా గ్రహిస్తాయి కాబట్టి ఈ పచ్చటి పొర గోడలపై ఉండటం వల్ల భవనాల లోపల వేడి తగ్గి ఏసీల వాడకం పరిమితం అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా ఇవి.. నగరాల్లోని ట్రాఫిక్ శబ్దాలను (Noise pollution) కూడా కొంతవరకు నియంత్రిస్తాయని పేర్కొంటున్నారు.
Also Read: ‘టెర్రాకూల్’ మ్యాజిక్.. మట్టి గోడలతో ఇల్లంతా కూల్.. మన ముత్తాతలే ఆదర్శం!
సాధారణంగా నగరాల్లో స్థలభావం వల్ల పార్కులు, తోటలు పెంచడం కష్టంగా మారుతోంది. ఈ టర్కీ ఆవిష్కరణతో స్థలంతో పనే లేదు. ప్రతి ఇంటి గోడ, మెట్రో పిల్లర్లు, ఫ్లైఓవర్లు, ఆఫీస్ బిల్డింగులను పచ్చని వనాలుగా మార్చవచ్చు. ఇది భవిష్యత్తులో పర్యావరణ అనుకూల స్మార్ట్ నగరాల నిర్మాణానికి ఒక మైలురాయిగా నిలవనుందని పరిశోధకులు అంటున్నారు. అయితే ప్రస్తుతం ఈ సాంకేతికత ప్రయోగదశలోనే ఉంది. ఈ స్టిక్కర్ తోటలు త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తే.. కాలుష్యం కోరల నుంచి నగరాలు బయటపడతాయని నిపుణులు అంటున్నారు.
Also Read: సామాన్యుడికి గుడ్ న్యూస్.. ఏసీ లేకున్నా లైఫ్ లాంగ్ కూలింగ్.. పైగా జీరో కరెంట్ బిల్లు!