NESCOD Technology: ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల వల్ల ఎండలు మండిపోతున్నాయి. మరీ ముఖ్యంగా ఎడారి దేశాల్లో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. ఇలాంటి తీవ్రమైన పరిస్థితుల్లో అక్కడి వారు ఏసీలు, కూలర్లు వాడటం తప్పనిసరి. అయితే దీనివల్ల విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగిపోతుందని ప్రజలు వాపోతున్నారు. అయితే ఈ సమస్యకు సౌదీ అరేబియాకు చెందిన శాస్త్రవేత్తలు ఒక విప్లవాత్మక పరిష్కారాన్ని కనుగొన్నారు. కరెంట్ అస్సలు అవసరం లేకుండా ఎంతటి తీవ్రమైన ఎండల్లోనైనా పరిసరాలను చల్లబరిచేలా ‘నెస్కోడ్’ (NESCOD) అనే సరికొత్త కూలింగ్ సిస్టమ్ను వారు అభివృద్ధి చేశారు.
సౌదీలోని కింగ్ అబ్దుల్లా యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (KAUST) కి చెందిన పరిశోధకులు.. ఈ NESCOD (Near Emissive Surface Cooling Device) సాంకేతికతను అభివృద్ధి చేశారు. ఇది విద్యుత్ శక్తితో కాకుండా కేవలం సహజ సిద్ధమైన భౌతిక సూత్రాల ఆధారంగా పనిచేసే ఒక సరికొత్త కూలింగ్ వ్యవస్థ. ఇది నేరుగా సూర్యకాంతి పడే ప్రాంతాలలో కూడా లోపలి వేడిని బయటకు పంపించి, వాతావరణాన్ని చల్లగా ఉంచగలదని పరిశోధకులు చెబుతున్నారు.
ఈ నెస్కోడ్ సాంకేతికత.. ఎండోథర్మిక్ డిసొల్యూషన్ (Endothermic Dissolution), సౌరశక్తి ఆధారంగా రెండు దశల్లో పనిచేస్తుంది. ఇందులో ‘అమ్మోనియం నైట్రేట్’ (Ammonium Nitrate) అనే రసాయన ఉప్పును నీటిలో కలుపుతారు. ఈ ఉప్పు.. నీటిలో కరిగేటప్పుడు చుట్టూ ఉన్న వేడిని లాగేసుకుని (Endothermic process), ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రతను ఒక్కసారిగా తగ్గిస్తుంది. ఇది కేవలం 20 నిమిషాల్లో ఉష్ణోగ్రతను 25 డిగ్రీల నుండి 3.6 డిగ్రీల వరకూ తగ్గించినట్లు ప్రయోగాల్లో నిరూపితమైంది.
అయితే అమ్మోనియం నైట్రేట్ ఉప్పు కరిగిన తర్వాత దానిని సూర్యకాంతి ద్వారా తిరిగి పొందొచ్చని పరిశోధకులు తెలిపారు. వేడికి నీరు ఆవిరైపోగా.. అమ్మోనియం నైట్రేట్ తిరిగి ఉప్పు స్ఫటికాలుగా మిగులుతుంది. ఈ విధంగా ఏర్పడిన ఉప్పును మళ్లీ కూలింగ్ కోసం తిరిగి వాడుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ప్రక్రియ అంతా సవ్యంగా జరిగేందుకు వీలుగా 3D సోలార్ రీజెనరేటర్ ను సైతం పరిశోధకులు రూపొందించారు.
నెస్కోడ్ పరిశోధకలు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సిస్టమ్ నడవడానికి ఒక్క యూనిట్ కరెంట్ కూడా అవసరం లేదు. ఏసీల వల్ల పర్యావరణానికి జరిగే హానిని ఇది పూర్తిగా నివారిస్తుంది. విద్యుత్ సౌకర్యం లేని మారుమూల గ్రామాల్లో, ఎడారి ప్రాంతాల్లో నివసించే ప్రజలకు, సైనికులకు ఇది ఎంతో ఉపయోగపడనుంది. విద్యుత్ లేకపోయినా కూరగాయలు, మందులు పాడవకుండా నిల్వ ఉంచే కోల్డ్ స్టోరేజ్ కంటైనర్ల కోసం దీనిని ఉపయోగించవచ్చు.
Also Read: ‘టెర్రాకూల్’ మ్యాజిక్.. మట్టి గోడలతో ఇల్లంతా కూల్.. మన ముత్తాతలే ఆదర్శం!
ప్రస్తుతం ఈ సాంకేతికత ప్రయోగశాల దశను దాటి వాణిజ్యపరంగా అందుబాటులోకి రావడానికి సిద్ధమవుతోంది. భవిష్యత్తులో ఇళ్ల పైకప్పులపై భవనాల గోడలపై ఈ నెస్కోడ్ మెటీరియల్ను అమర్చడం ద్వారా ఏసీల వాడకాన్ని సగానికి పైగా తగ్గించవచ్చని పరిశోధకులు నమ్ముతున్నారు. గ్లోబల్ వార్మింగ్తో సతమతమవుతున్న ఆధునిక ప్రపంచానికి సౌదీ శాస్త్రవేత్తలు అందించిన ఈ ఆవిష్కరణ ఒక గొప్ప వరమనే చెప్పాలి.
Also Read: BSNL మరో చౌకైన ప్లాన్.. రూ. 397కే 5 నెలల వ్యాలిడిటీ.. అన్లిమిటెడ్ కాల్స్, డేటా!