WhatsApp New Feature: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ తమ వినియోగదారుల ప్రైవసీని మరింత పటిష్టం చేయడానికి సరికొత్త ఫీచర్ను సిద్ధం చేస్తోంది. ఇప్పటివరకు ఉన్న డిసప్పియరింగ్ మెసేజ్ ఆప్షన్లలో నిర్దిష్ట సమయం తర్వాత మాత్రమే మెసేజ్లు డిలీట్ అయ్యేవి. కానీ, ఇకపై అవతలి వ్యక్తి మెసేజ్ చదివిన వెంటనే అది మాయమైపోయేలా సరికొత్త ప్రైవసీ కంట్రోల్స్ను వాట్సప్ పరీక్షిస్తోంది.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న సిస్టమ్లో మనం మెసేజ్ పంపినప్పటి నుంచే టైమ్ కౌంట్డౌన్ మొదలవుతుంది. కానీ ఈ కొత్త ఫీచర్లో అవతలి వ్యక్తి ఆ మెసేజ్ను ఓపెన్ చేసి చదివిన తర్వాతే టైమర్ రన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దీనివల్ల ముఖ్యమైన, అత్యంత రహస్యమైన సమాచారాన్ని పంచుకునేటప్పుడు యూజర్లకు పూర్తి భద్రత లభిస్తుంది.
ఈ ఫీచర్ వాట్సప్లోని డిసప్పియరింగ్ మెసేజ్ సెట్టింగ్స్లోనే ‘ఆఫ్టర్ రీడింగ్’ అనే పేరుతో కనిపించనుంది. ఇందులో మెసేజ్ చూసిన తర్వాత 5 నిమిషాలు, ఒక గంట లేదా 12 గంటల వ్యవధిలో ఎప్పుడైనా డిలీట్ అయిపోయేలా యూజర్లు తమకు నచ్చిన ఆప్షన్ను సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ అవతలి వ్యక్తి ఆ మెసేజ్ను అసలు ఓపెన్ చేయకపోతే.. 24 గంటల తర్వాత అది ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది.
Also Read: Samsung Galaxy S25 FEపై పిచ్చెక్కించే డిస్కౌంట్.. రూ.12,000 ఆదా చేసుకునే లక్కీ ఛాన్స్!
ఈ ఫీచర్లో మెసేజ్ డిలీట్ అయ్యే విధానం ఇద్దరికీ కాస్త భిన్నంగా ఉంటుంది. మెసేజ్ పంపిన వ్యక్తి చాట్ స్క్రీన్ నుండి మనం సెట్ చేసిన టైమర్ ప్రకారం మెసేజ్ మాయమైపోతుంది. అదే సమయంలో మెసేజ్ అందుకున్న వ్యక్తికి మాత్రం, ఆయన ఆ చాట్ ఓపెన్ చేసి చదివిన తర్వాతే కౌంట్డౌన్ మొదలవుతుంది. ఈ ఫీచర్ పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. కావాల్సిన వారు మాన్యువల్గా కూడా ఆన్ చేసుకోవచ్చు.
ప్రస్తుతం ఈ సరికొత్త ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ బీటా వర్షన్లలో కొద్దిమంది యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. యాపిల్ టెస్ట్ఫ్లైట్ ప్రోగ్రామ్ ద్వారా ఐఫోన్ బీటా టెస్టర్లు దీనిని వాడుతున్నారు. ఈ టెస్టింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత, రాబోయే కొన్ని వారాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాధారణ వాట్సప్ యూజర్లందరికీ ఈ అప్డేట్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
Also Read: హోటళ్లలో QR కోడ్ స్కాన్ చేస్తున్నారా? జాగ్రత్త సుమీ.. ఈ ఒక్క తప్పుతో మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అవ్వొచ్చు!