Xiaomi Kids Watch: ఈ రోజుల్లో పిల్లలు బయట ఆడుకోవడానికి వెళ్లినా లేదా స్కూల్కు వెళ్లినా.. వారు క్షేమంగా ఉన్నారా? లేదా? అని ప్రతి నిమిషం తల్లిదండ్రుల మనసులో ఏదో ఒక ఆందోళన ఉంటూనే ఉంటుంది. స్మార్ట్ఫోన్ ఇద్దామంటే అది పిల్లల్ని దారి తప్పిస్తుందేమోనన్న భయం.. ఇవ్వకపోతే వారు ఎక్కడున్నారో తెలియని అయోమయం. ఇలాంటి సమస్యలన్నింటికీ ఒకే ఒక్క పరిష్కారంగా షియోమీ తన సరికొత్త ‘Xiaomi Kids Smartwatch’ను మార్కెట్లోకి తెచ్చింది. పిల్లలకు బాడీగార్డ్లా తోడుండే ఈ గ్యాడ్జెట్లో ఉన్న విశేషాలేంటో ఇప్పుడు చూసేద్దాం రండి..
ఈ వాచ్ చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. దీనిలో 1.75 అంగుళాల AMOLED డిస్ప్లేను అమర్చారు. ఇది దృశ్యాలను చాలా స్పష్టంగా చూపిస్తుంది. స్టార్ రివర్ బ్లూ, నెబ్యులా పర్పుల్ వంటి ఆకర్షణీయమైన రంగుల్లో లభించే ఈ వాచ్.. పిల్లలకు ఖచ్చితంగా నచ్చుతుంది.
షియోమీ కిడ్స్ స్మార్ట్ వాచ్ ప్రత్యేకత ఏమిటంటే.. దీనిలో ఉన్న ఫ్లిప్ అప్ డ్యూయల్ కెమెరా మెకానిజం. వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ కెమెరా, చుట్టుపక్కల పరిసరాలను చూపించడానికి వెనుక భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
ఇక భద్రతలో కోసం ఈ వాచ్లో జీపీఎస్ను అమర్చారు. ఇది మనకు లొకేషన్ను చూపిస్తుంటుంది. అంతేకాదు.. ఇందులో AI ఆధారిత ఫ్లోర్లెవల్ పొజిషనింగ్ సిస్టమ్ను ప్రవేశపెట్టింది. దీనివల్ల మీ పిల్లలు ఏదైనా అపార్ట్మెంట్ లేదా షాపింగ్ మాల్లో ఉన్నప్పుడు.. వారు ఏ అంతస్తులో ఉన్నారో కూడా కచ్చితంగా తెలుసుకోవచ్చు. దీనికి తోడు జియో ఫెన్సింగ్, స్కూల్ నుంచి వచ్చే టైమింగ్స్, ఏదైనా ఎమర్జెన్సీ సమయంలో వాడుకునే వన్ టచ్ SOS ఫీచర్లు పేరెంట్స్కు కొండంత అండగా నిలుస్తాయి.
ఈ స్మార్ట్వాచ్లో 1GB RAM, 16GB ఇంటర్నల్ స్టోరేజ్ అందుబాటులో ఉంది. పిల్లల దైనందిన అవసరాల కోసం WeChat, QQ వంటి కస్టమైజ్డ్ యాప్లకు ఇది సపోర్ట్ చేస్తుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే.. 740mAh సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఎక్కువ కాలం మన్నికనిస్తుంది. కేవలం 30 నిమిషాల్లోనే 50 శాతం వరకు ఛార్జ్ అయ్యే ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ దీనికి అదనపు బలం.
అలాగే Xiao Ai వాయిస్ అసిస్టెంట్, NFC సపోర్ట్ ద్వారా స్మార్ట్ డోర్ లాక్లను ఆపరేట్ చేయడం కూడా సులభమవుతుంది. అలాగే పిల్లల చదువులతో పాటు వారి శారీరక దృఢత్వం మీద కూడా ఈ వాచ్ దృష్టి పెడుతుంది. అందుకే ఈ వాచ్లో హృదయ స్పందన రేటును గమనించే ఫీచర్తో పాటు, K12 విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన 18 రకాల స్పోర్ట్స్ మోడ్స్ను చేర్చారు.
షియోమీ కిడ్స్ స్మార్ట్వాచ్ పిల్లలను ఆటపాటల్లో ప్రోత్సహిస్తూనే వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తుంది. ప్రస్తుతానికి చైనా మార్కెట్లో విడుదలైన ఈ వాచ్ ధర సుమారు రూ. 18,300 గా ఉంది. అత్యాధునిక సాంకేతికతతో, పిల్లల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ వచ్చిన ఈ గ్యాడ్జెట్ త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ పొందే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
Also Read: రూ.12 కోట్లు.. 400 రత్నాలు.. వంతారా థీమ్తో అనంత్ అంబానీ కోసం అరుదైన వాచ్!