DEE Divya Jyoti: రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపల్ మాజీ డిప్యూటీ ఇంజనీర్ దివ్య జ్యోతి.. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదని పేరామెది. అవినీతిలో ఆమె అవినీతి వేరయా.. అనిపించుకున్న రకం దివ్య జ్యోతి. లంచం లేకుండా ఒక్కరోజు ఇంటికి రాదు. మూటలు అంటకుండా పెన్నుకు పని చెప్పదు. అసలు.. దివ్య జ్యోతిపై తన భర్తే ఫిర్యాదు అవినీతి ఆరోపణలు చేశాడంటే ఆమె అవినీతి ఎంత ఆరితేరిపోయిందో అర్థం చేసుకోవచ్చు. భర్త ఆరోపణలతోనే ఆమె కేసుకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. గత అక్టోబర్లో తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న దివ్యజ్యోతి కేసుపై ఏసీబీ అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇవాళ మణికొండ మున్సిపల్ ఆఫీసులో ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు.
ఈడీగా పనిచేసినపుడు దివ్యజ్యోతి ఎన్ని ఫైల్స్ క్లియర్ చేసింది? ఏఏ కాంట్రాక్టర్లతో లంచాలు తీసుకుందనే అనే అంశాలను అధికారులు ఆరా తీస్తున్నారు. ఆమె క్లియర్ చేసిన ఫైల్స్కు సంబంధించి కీలక పత్రాలను ఏసీబీ స్వాధీనం చేసుకున్నారు. అక్కడ ఆమె పని తీరుపై కూడా అధికారులు ఆరా తీశారు. ఎన్ని సంవత్సరాల నుంచి విధులు నిర్వహించిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
కాంట్రాక్టర్ల దగ్గర లక్షల రూపాయలు లంచాలు తీసుకుందని ఆమెపై తొలి నుంచి ఆరోపణలు ఉన్నా.. ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో అధికారులు ముందుకు కదలలేకపోయారు. కానీ.. దివ్యజ్యోతి భర్త శ్రీపాద గతంలో ఆమెపై సంచలన ఆరోపణలు చేశారు. లంచం తీసుకోకుండా ఆమె ఇంటికి రాదని కామెంట్స్ చేశారు. ఇంటికి తన భార్య భారీగా నోట్ల కట్టలు తీసుకొస్తుందంటూ వీడియోలు కూడా విడుదల చేశారు. దివ్య జ్యోతి లంచాలు తీసుకుంటుంది అనడానికి ఇవే సాక్ష్యాలని చెప్పుకొచ్చారు. ఆ వీడియోలు చూసిన వారంతా నివ్వెరబోయారు. ఎక్కడ చూసిన డబ్బుల కట్టలే. దీంతో ఆమెపై వచ్చిన ఆరోపణలకు బలం చేకూరినట్టైంది.
Also Read: ఎన్ని ఇబ్బందులొచ్చినా ప్రజావాణి కొనసాగిస్తాం: భట్టి విక్రమార్క
దివ్యజోతికి, తన భర్తకు మధ్య విబేధాలు, గొడవలు, విడాకుల కేసు ఉండడం వలనే ఆయన ఆరోపణలు చేస్తున్నారనే వాదన కూడా ఉంది. కానీ.. శ్రీపాద చూపించిన డబ్బుల లెక్కలైనా తేలాల్సి ఉంది. దీంతో ఏసీబీ ఈ కేసుపై స్పెషల్ ఫోకస్ చేసింది. మొత్తానికి రంగంలో దిగింది. మణికొండ మున్సిపల్ లో తనిఖీలు చేసింది. అధికారులు స్వాధీనం చేసుకున్న పత్రాలను పూర్తిగా పరిశీలించిన తర్వాత ఆమె సంతకాలు చేసిన కాంట్రాక్టర్లను విచారిస్తారని తెలుస్తోంది. ఆ తర్వాత దివ్యజ్యోతిపై చర్యలు ఉంటాయని ప్రచారం నడుస్తోంది.