Addanki Dayakar: స్వేచ్ఛ బ్యూరో: బ్యారేజీలు దెబ్బతిన్నాయని, నీళ్లు నింపితే కూలిపోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతుంటే.. బలవంతంగా నీళ్లు నింపాలని హరీష్ రావు డిమాండ్ చేయడంపై ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. “మ్యాప్ వేసి చూపించినా అర్థం కాకపోవడానికి నీకేమైనా మెంటల్ ఎక్కిందా? సోల్లు కబుర్లు, బేవకూఫ్ మాటలు కట్టిపెట్టు” అంటూ ఆయన హరీష్ పై ఘాటుగా విమర్శించారు. ఇసుక పునాదులపై పిల్లర్లు కట్టి ప్రాజెక్టును నాశనం చేసి, ఇప్పుడు నీటి దొంగలే నీతులు చెబుతున్నారని మండిపడ్డారు.
కేసీఆర్ సంతకం చూసి సంతకం పెట్టే రకంగతంలో రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన నివేదికలను కేసీఆర్ ఎందుకు పక్కన పెట్టారో సమాధానం చెప్పాలని అద్దంకి దయాకర్ డిమాండ్ చేశారు. “పంపు హౌస్లు ఎక్కడ పడితే అక్కడ కాదు, నీళ్లు ఉన్న చోట పెట్టాలి అనే కనీస జ్ఞానం కూడా లేదు. కేసీఆర్ ఏది చెప్తే అది, ఆయన సంతకం చూసి బ్లైండ్గా సంతకం పెట్టే రకం హరీష్ రావు” అని ఆయన ఎద్దేవా చేశారు. ఐదేళ్లు మంత్రిగా ఉండి ఏం చేయలేకపోయిన హరీష్.. ఇప్పుడు మూడు నెలలు సమయం ఇస్తే చేసి చూపిస్తాననడం హాస్యాస్పదమన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణపై బావ, బావమరుదులకు (కేటీఆర్, హరీష్ రావు) కనీస అవగాహన లేదని దయాకర్ విమర్శించారు. వారం రోజులు సమయం ఇవ్వాలని కేటీఆర్ అంటే, మూడు నెలలు కావాలని హరీష్ రావు అంటున్నారని.. అసలు వీరిద్దరిలో ఎవరికీ స్పష్టత లేదని ఎద్దేవా చేశారు. నాగార్జున సాగర్ కట్టి ఇన్నేళ్లయినా కనీసం కుంగలేదని, కానీ కాళేశ్వరం మాత్రం అప్పుడే కుంగిపోయిందని గుర్తుచేశారు.
Also read: Harish Rao: హరీష్ రావు కసబ్ లాంటోడు.. మెట్టు సాయి కుమార్ ఫైర్!
వైఎస్సార్ ఆనవాళ్లను చెరిపేయాలని చూసింది బీఆర్ఎస్ నాయకులేనని, ఇప్పుడు కేసీఆర్ ఆనవాళ్లు పోతున్నాయని అనడం తగదని దయాకర్ అన్నారు. “ఇంట్లో కూర్చున్న వాడు (కేసీఆర్) బయటకు రాడు.. బయటకు వచ్చిన వాడికి (హరీష్ రావు) తెలివి లేదు” అంటూ ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అసలు ఒక ఆఫ్ట్రల్ ఎమ్మెల్యే అయిన హరీష్ రావు స్థాయి ఎంత? మా స్థాయి కంటే నీ స్థాయి చాలా తక్కువ అని హెచ్చరించారు.”దమ్ముంటే కేసీఆర్ను అసెంబ్లీకి తీసుకురా!” “హరీష్ రావుకు అంతగా దమ్ముంటే, ఇంట్లో దాక్కున్న కేసీఆర్ను అసెంబ్లీకి తీసుకురావాలి. అక్కడ చర్చకు సిద్ధం కావాలి. ప్రజల రక్తాన్ని పీల్చిన జలగలు ఆ నలుగురు (కేసీఆర్ కుటుంబం)అవినీతిని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.” అని అద్దంకి దయాకర్ మండి పడ్డారు.
ఇక బీజేపీ నేత ఈటెల రాజేందర్పై కూడా అద్దంకి దయాకర్ స్పందించారు. ఈటెల కూడా ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని.. ఆయన అటు (బీఆర్ఎస్) వైపు వెళ్తాడో, లేక కాంగ్రెస్ వైపు వస్తాడో ఎవరికీ అర్థం కావడం లేదంటూ ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ద్రోహులకు, అవినీతి పరులకు ప్రజలే బుద్ధి చెబుతారని దయాకర్ హెచ్చరించారు.
Also read: Ramchander Rao: సీఎం రేవంత్ రెడ్డికి.. బీజేపీ చీఫ్ రాంచందర్ రావు బహిరంగ లేఖ!