Jaggareddy: స్వేచ్ఛ బ్యూరో: బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, హరీష్ రావులపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. లక్ష కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయిన కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యంపై ముందుగా రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే వారు మాట్లాడాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుల మేలు కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం తమ రాజకీయ సంస్కృతి అని స్పష్టం చేశారు. ఆదివారం ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబం, ఈటల రాజేందర్ లక్ష్యంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు.రక్తం చిందించే ధైర్యం హరీష్ రావుకు లేదని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు.
హరీష్ రావుపై జగ్గారెడ్డి విమర్శలు..
తెలంగాణ ఉద్యమం పీక్ స్థాయిలో ఉన్నప్పుడు యువకులు బలిదానాలు చేసుకుంటుంటే, హరీష్ రావు మాత్రం పెట్రోల్ పోసుకుని అగ్గిపెట్టె తీసుకురావడం మర్చిపోయి నాటకాలు ఆడారని విమర్శించారు. ‘పెట్రోల్ తెచ్చుకున్నవాడు అగ్గిపెట్టె తెచ్చుకోలేడా?’ అని ఆయన ప్రశ్నించారు.కేసీఆర్ కుటుంబం హింసకు ‘కేరాఫ్ అడ్రస్’ అని ఆయన ఆరోపించారు. వారి రెచ్చగొట్టే స్వభావం, మాటల వల్లే నాడు ఆత్మహత్యలు జరిగాయన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏదో ఒకటి అనడమే హరీష్ రావు ఎజెండాగా పెట్టుకున్నారని, ఆయన తీరు సైకోలా తయారైందని మండిపడ్డారు.
Also Read: కేటీఆర్.. ఇంకెంత కాలం తెలంగాణను పీక్కుతింటారు? విప్ వీరేశం సంచలనం
కేసీఆర్, హరీష్ రావులకు సవాల్..
ఇక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఈటల రాజేందర్ ఆర్థిక మంత్రిగా ఉన్నారని, అందుకే ఇప్పుడు బీఆర్ఎస్ నేతలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. బీజేపీలో కీలక నేతగా ఉన్న ఈటలకు రైతులపై నిజమైన ప్రేమ ఉంటే, కేసీఆర్, హరీష్లను ఒప్పించి కేంద్రం దగ్గరికి తీసుకెళ్లాలని సవాల్ విసిరారు. అవసరమైతే కాంగ్రెస్ మంత్రులు కూడా వస్తారని, ఆ పని చేయకుండా ఊరికే ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు.నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికలో ఏది చెప్తే అది చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఎన్ డి ఎస్ ఏ దగ్గరికి వెళ్దామంటే హరీష్ రావు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
పంచాయితీలు అంటేనే కాంగ్రెస్..
మరో వైపు ‘పంచాయితీలు అంటేనే కాంగ్రెస్’ అని జగ్గారెడ్డి కుండబద్దలు కొట్టారు. అన్ని పార్టీల్లోనూ గొడవలు ఉంటాయని, అయితే ఇతర పార్టీలు లోపల మాట్లాడుకుంటే, తమ పార్టీ నేతలు బయట బహిరంగంగానే మాట్లాడతారని, అదే తేడా అని స్పష్టం చేశారు. తుంగతుర్తి వ్యవహారంపై ప్రస్తుతం పోస్ట్మార్టం జరుగుతోందని, కోపతాపాలు సహజమని అన్నారు. నేతలందరి అభిప్రాయాలుతీసుకుంటున్నామని, దానిని ఎలా సెట్ చేయాలో చూసి, నివేదిక సిద్ధం చేసి పార్టీ అధిష్టానానికి అందజేస్తామని జగ్గారెడ్డి వెల్లడించారు.
Also Read: బీఆర్ఎస్ యాక్షన్.. కాంగ్రెస్ డైరెక్షన్! కాళేశ్వరంపై బండి సంజయ్ హాట్ కామెంట్స్