
BJP: అది తెలంగాణలో బలమైన మీడియా. టీవీ, పేపర్తో బీజేపీ వాయిస్ను బలంగా వినిపిస్తోంది. ఆ మీడియా అధినేత మాజీ ఎంపీ, గడ్డం వివేక్ వెంకటస్వామి. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కూడా. ఆయన పార్టీ మారుతారంటూ ఇటీవల తరుచూ ప్రచారం జరుగుతోంది. వివేక్కు బీజేపీలో తగినంత గుర్తింపు లేదని.. త్వరలోనే కాంగ్రెస్లో చేరుతారని అన్నారు..అంటున్నారు. తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పడిపోవడం.. కాంగ్రెస్ దూకుడు మీదుండటంతో.. ఈ మాజీ కాంగ్రెస్ నేత మళ్లీ సొంతగూటికి చేరుతారని చెబుతున్నారు. అందుకు మరింత బలం చేకూర్చేలా.. వివేక్ వెంకటస్వామి కుమారుడు వంశీ లేటెస్ట్గా ఓ వీడియో పోస్ట్ చేశారు. అందులో, ప్రధాని మోదీపై, కేంద్ర సర్కారు తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీ జాతీయ కార్యవర్గం సభ్యుడి కుమారుడే.. ఇలా మోదీని ఏకిపారేయడంతో.. ఆ వీడియో రాజకీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.
వంశీ తన వీడియోలో.. తాజా రాజకీయాలపై మోదీని ఫుల్గా కార్నర్ చేశారు. మణిపూర్ మంటల కన్నా పార్లమెంట్లో చర్చ సందర్భంగా రాహుల్గాంధీ ఇచ్చిన ఫ్లైయింగ్ కిస్పై ఎక్కువ అటెన్షన్ కనిపించిందని విమర్శించారు. ప్రధాని మోదీ స్పీచ్ను వాడుకుంటూ వీడియో రిలీజ్ చేశారు. మోదీ తీరుపైనా తీవ్ర సెటైర్లు వేశారాయన. మణిపూర్లో అంతర్యుద్ధంలాంటి పరిస్థితులున్నాయని అన్నారు. బీజేపీ ఎంపీలు ఎవరూ దానిపై మాట్లాడలేదని తప్పుపట్టారు.
మణిపూర్ అంశంపై పార్లమెంట్లో కేంద్రమంత్రులు సమాధానం చెప్పకుండా, రాహుల్గాంధీ ఫ్లైయింగ్ కిస్ను స్మృతి ఇరానీ తెరపైకి తెచ్చారని గడ్డం వివేక్ తనయుడు వంశీ ఎద్దేవా చేశారు. అతిపెద్ద అంశాన్ని పక్కన పెట్టి ఓ చిన్న విషయంపై రాద్ధాంతం చేశారని విమర్శించారు. వాస్తవ సమస్యలను రాజకీయ నేతలు ఎలా తొక్కిపెడతారో చెప్పడానికి మణిపూర్ ఘటనే ఓ నిదర్శనమంటూ గడ్డం వంశీ స్వయంగా చెప్పుకొచ్చారు.
గడ్డం వివేక్ వెంకటస్వామి తనయుడు వంశీ ఎందుకిలా చేశారు? తాను పూర్తి స్పృహతోనే ఈ వీడియో చేశారా? ఏకంగా ప్రధానమంత్రి మోదీని టార్గెట్ చేయడం వెనుక వంశీ లక్ష్యమేంటి? ఇప్పుడివే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మణిపూర్ అంశంపై, బీజేపీ తీరుపై జాతీయ స్థాయిలో విమర్శలు వచ్చాయి. వస్తున్నాయి. కానీ.. వివేక్ తనయుడు వంశీ చేసిన వీడియో ఇప్పుడు ఎక్కువ చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే వంశీ తండ్రి వివేక్ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా కొనసాగుతున్నారు. తన తండ్రి ఉన్న పార్టీపైనే వంశీ విమర్శలు చేయడంపై రాజకీయ రచ్చ రాజుకుంది. కావాలనే బీజేపీపై వంశీ విమర్శలు చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీని వివేక్ వీడతారంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో వంశీ వీడియో చేశారా అనే సందేహాలు వినిపిస్తున్నాయి. జాతీయ స్థాయిలో ప్రకంపనలు రేపడంతో కాసేపటికే వీడియో డిలీట్ చేశారు గడ్డం వంశీ.