మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో అధికార పార్టీ ఈ ఎన్నికల్లో గెలిచేందుకు పక్కా ప్రణాళికలు రచిస్తున్నది. ముందుగానే పకడ్బందీగా వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్నారు.ఆయన ఫిబ్రవరి 1న హైదరాబాద్కు తిరిగిరానున్నట్టు సమాచారం.దీంతో నేరుగా అక్కడి నుంచే ఆయన ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నెల 18న మేడారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కేబినెట్ భేటీలోనే ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాకుండా, జిల్లాలకు ఇన్చార్జిల మంత్రులను నియమించి వారిపై మున్సిపల్ ఎన్నికల బాధ్యతలను పెట్టింది.
మున్సిపల్ ఎన్నికలను సీఎం రేవంత్ సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తున్నది. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ప్రభుత్వానికి సీట్లు తగ్గాయి. ఈసారి అలాంటి తప్పులు జరగకుండా పార్టీకి అత్యధిక స్థానాలు దక్కేలా సీఎం ఈ విషయంలో ప్రత్యేక దృష్టి సారించినట్టు చర్చ జరుగుతున్నది. అందుకే ఆయన మున్సిపల్ ఎన్నికల బాధ్యతలను స్థానిక లీడర్లకు కాకుండా ఏకంగా మంత్రులకే బాధ్యతలు అప్పగించారు. కిందిస్థాయి నేతలను సమన్వయం చేసుకుంటూ అసంతృప్తులు లేకుండా రెబల్స్ బెడద లేకుండా చూడాల్సిన బాధ్యతను సైతం మంత్రులకే అప్పగించారు. ఈ ఎన్నికల ఫలితాల ఆధారంగా మంత్రులకు రేటింగ్ ఇవ్వనున్నట్టు సమాచారం. అందుకే వారి పనితీరుపై ఇంటెలిజెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్నట్టు తెలుస్తున్నది.
ఈ ఎన్నికల్లో అత్యుత్తమంగా ప్రతిభ కనబరించిన మంత్రులు, నేతలకు కేబినెట్ విస్తరణలో ప్రాధాన్యం ఉంటుందని.. నెగెటివ్ ఫలితాలు వస్తే వారిపై చర్యలు తప్పవని పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతున్నట్టు సమాచారం. ఇదే విషయాన్ని టీపీసీసీ చీఫ్ సైతం మంత్రులు, జిల్లానేతలకు వివరించినట్టు తెలుస్తున్నది.కేబినెట్ భేటీలో బాధ్యతలు అప్పగించాక కూడా కొందరు మంత్రులు ఇంకా క్షేత్రస్థాయికి వెళ్లి స్థానిక లీడర్లతో సమావేశం కాలేదని తెలుస్తున్నది. అంతేకాకుండా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహుల జాబితా ఫైనల్ లిస్టును ఇంకా పార్టీ రాష్ట్ర నాయకత్వానికి పంపించలేదని సమాచారం. ఇదే విషయంపై అధినాయకత్వం ఆరా తీయగా.. తమకు శాఖల పనులే సరిపోవడం లేదని, ఈ బాధ్యతల నుంచి తమను తప్పించాలని వినతులు వెళ్లినట్టు సమాచారం.
YSRCP : గురు భక్తి.. జగన్ అలా చేస్తేనే మళ్లీ అధికారంలోకి వస్తారు!
ఇంటెలిజెన్స్ నివేదికలు, మంత్రుల వినతుల ఆధారంగా సర్కార్ కొత్త స్ట్రాటజీని ప్రిపేర్ చేస్తున్నట్టు తెలుస్తున్నది. జిల్లా స్థాయిలోనే మంచి పట్టున్న నేతలకు మున్సిపల్ ఎన్నికల బాధ్యతలు అప్పగించాలని యోచిస్తున్నట్టు సమాచారం. ఇక వారికి ఏమైనా సహాయ సహకారాలు అందించే బాధ్యతను మాత్రం మంత్రులపైనే ఉంచనున్నట్టు తెలుస్తున్నది. ఎలాగూ ప్రతిపక్ష పార్టీని కార్నర్ చేయడానికి సర్కార్ వద్ద చాలానే అస్త్రాలు ఉన్నాయి. ప్రస్తుతం సిట్ విచారణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక మున్సిపల్ ఎన్నికల్లో మహిళా ఓటర్లను టార్గెట్ చేసేందుకు కొత్తరకం స్కీం లేదా మహిళా రుణాలు, చీరల పంపిణీ, 50 శాతం రిజర్వేషన్ల అంశాన్ని వాడుకోవాలని సర్కార్ భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. సర్కార్ ఇదే స్ట్రాటజీతో ముందుకు వెళితే పురపోరులో ఆశించిన ఫలితాలు తప్పక వస్తాయని ఆలోచన చేసినట్టు తెలుస్తున్నది.