ఏపీ రాజకీయాల్లో వైసీపీ అధికారంలోకి రావాలంటే కొన్ని పనులు తప్పక చేయాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి జోస్యం చెప్పారు. ప్రస్తుతం ఆయన జగన్కు దూరంగా ఉంటున్నారు.దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాటి హయాం నుంచి విజయసాయి రెడ్డి ఆ కుటుంబంతో సన్నిహితంగా ఉంటూ వచ్చారు. వైఎస్సార్ మరణం తర్వాత జగన్ అవినీతి కేసుల్లో నాడు ఆడిటర్గా ఉన్న విజయసాయి పలు కేసుల్లో ఇరుకున్నారు. వైఎస్ కుటుంబానికి మేలు చేయడం కోసం లెక్కల్లో ఫ్రాడ్ చేశారని.. అవినీతి కప్పిపుచ్చడానికి ప్రభుత్వాన్ని మోసం చేశారని ఆయనపై అభియోగం నమోదైంది. ఇక జగన్ అక్రమాస్తుల కేసుల్లో విజయసాయిరెడ్డి సైతం చిక్కుల్లో ఇరుక్కుని జైలుజీవితం గడిపారు.
2019 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావడంతో తనకు ఇంతకాలం వెన్నంటే ఉన్న విజయసాయి రెడ్డిని మాజీ సీఎం జగన్ రాజ్యసభకు పంపారు. అయితే, జగన్ అధికారంలో ఉన్నన్ని రోజులు బాగానే ఉన్న ఆయన అధికారం పోగానే ఆయనకు విజయసాయి రెడ్డి దూరంగా ఉంటూ వచ్చారు. తీరా చూస్తే గతేడాది ప్రారంభంలో తన రాజ్యసభ సభ్వత్వానికి రాజీనామా చేసి వైసీపీ పార్టీకి సైతం గుడ్ బై చెప్పారు. దీని వెనుక అంతర్గత కారణాలు ఏమున్నా.. తనకు పార్టీలో ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఇందుకు జగన్ చుట్టూ ఉన్న మనుషులే కారణమని చెప్పుకొచ్చారు.
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏపీలో భారీ లిక్కర్ స్కామ్ జరిగింది. ఈ కేసులో ఇటీవల సీబీఐ ఎదుట విచారణకు హాజరైన విజయసాయి రెడ్డి..విచారణ అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మరోసారి జగన్ను పొగుడుతూ సీఎం చంద్రబాబు, తెలుగుదేశం పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. మొన్నటివరకు రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన మరోసారి క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించి అందరినీ షాక్కు గురిచేశారు. తాను వైసీపీలో చేరనని.. అలాగాని తెలుగుదేశం పార్టీలోకి వెళ్లడం లేదని స్పష్టంచేశారు. ఇక ఆయన బీజేపీలోకి వెళ్తున్నారని పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇదిలాఉంటే లిక్కర్ స్కామ్ కేసులో జగన్ తప్పు ఏమీ లేదని మాజీ ఎంపీ ప్రకటించడం హాట్ టాపిక్గా మారింది.
లిక్కర్ స్కామ్ అంతా.. నాటి ప్రభుత్వ సలహాదారు సజ్జల మరికొందరు నేతల ప్రమేయంతో జరిగిందని.. ఈ విషయం జగన్కు తెలియకుండా వారు మేనేజ్ చేసి ఉంటారని.. తెలిస్తే జగన్ ఇలా జరగనిచ్చేవారు కాదని చెప్పడంతో అంతా షాకయ్యారు. ఇక మరోసారి అధికారంలోకి వచ్చేందుకు పాదయాత్ర ప్రారంభించాలని మాజీ సీఎం తీసుకున్న నిర్ణయంపైనా ఆయన స్పందించారు. జగన్ అధికారంలోకి రావాలంటే ముందుగా కూటమి విచ్చిన్నం కావాలని.. లేదంటే జగన్ అధికారంలోకిరావడం కష్టమేనని అన్నారు. దీనికి తోడు ముందుగా తన కోటరిని మార్చి వారి మాటలు వినొద్దని.. ప్రజల అభిప్రాయాలు సేకరించి అందుకు అనుగుణంగా ముందుకు పోతే ఏదైనా ఫలితం ఉంటుందని మాజీ ఎంపీ విజయసాయి హితవు పలికారు. ఆయన వ్యాఖ్యలపై పలువురు స్పందిస్తూ.. గురు భక్తి ప్రకటించిన విజయసాయి ఆ పార్టీ నుంచి ఎందుకు బయటకు వచ్చారు? ప్రజలను డైవర్ట్ చేసి జగన్ను అధికారంలోకితీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నారా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.