ACB Trap: ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి తిమింగలాల ఆగడాలకు అడ్డుకట్ట వేసేలా ఏసీబీ అధికారులు మరోసారి మెరుపు దాడి చేశారు. పెద్దపల్లి మున్సిపాలిటీలో అసిస్టెంట్ ఇంజనీర్ (AE)గా పనిచేస్తున్న సతీష్, లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్హ్యాండెడ్గా చిక్కారు. మున్సిపల్ పరిధిలో తాను చేసిన పనులకు సంబంధించిన ఎంబీ రికార్డ్ నమోదు చేసి, బిల్లులను క్లియర్ చేయాలని కోరిన ఒక కాంట్రాక్టర్ను లంచం డిమాండ్ చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
బాధితుడు, కాంట్రాక్టర్ అయిన బత్తుల శ్రీను మున్సిపల్ పరిధిలో పలు సివిల్ పనులను పూర్తి చేశారు. వాటికి సంబంధించిన సుమారు లక్షల రూపాయల బిల్లులు సకాలంలో మంజూరు కావాలంటే ఎంబీ రికార్డు నమోదు చేయడం తప్పనిసరి. అయితే, దీని కోసం ఏఈ సతీష్ చుట్టూ తిరిగినా పని కాలేదు. చివరకు రూ. 2 లక్షలు లంచం ఇస్తేనే రికార్డులను క్లియర్ చేస్తానని సతీష్ తెగేసి చెప్పడంతో.. లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధిత కాంట్రాక్టర్ చివరకు ACB అధికారులను ఆశ్రయించారు.
బాధితుడి ఫిర్యాదు ఆధారంగా కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు పక్కా వ్యూహంతో వల పన్నారు. నిశ్చయించుకున్న పథకం ప్రకారం.. కాంట్రాక్టర్ బత్తుల శ్రీను నుండి ఏఈ సతీష్ తన నివాసం వద్ద రూ. 2 లక్షల నగదు తీసుకుంటుండగా ఏసీబీ సిబ్బంది మెరుపు దాడి చేశారు. ఏఈ సతీష్ను తప్పించుకునే అవకాశం లేకుండా రసాయన పరీక్షల ద్వారా ఆధారాలతో సహా రెడ్హ్యాండెడ్గా అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఆకస్మిక దాడితో పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఒక్కసారిగా కలకలం రేగింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు అనంతరం మున్సిపల్ కార్యాలయానికి తరలించి అక్కడ ఆయనకు సంబంధించిన కీలక రికార్డులను, ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు జరగాలంటే లంచాలు ఇవ్వాల్సిన పనిలేదని, ఎవరైనా లంచం అడిగితే వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్కు సమాచారం అందించాలని అధికారులు ఈ సందర్భంగా ప్రజలకు స్పష్టం చేశారు.
Also Read: బంగ్లాదేశ్లో వరద బీభత్సం.. 54 మంది మృతి, రోడ్డున పడ్డ 6 లక్షల మంది