Property Dispute: కనిపెంచి, లాలించి, ప్రయోజకులను చేసిన కన్నతల్లే వారికి భారమైంది. పండుటాకులాంటి వయసులో ఆసరాగా నిలవాల్సిన కొడుకులే ఆమెకు నరకాన్ని పరిచయం చేశారు. ఆస్తి మొత్తం తమ పేరిట రాయించుకుని, ఆ తర్వాత అన్నం పెట్టకుండా ఆ వృద్ధురాలిని ఇంటి నుంచి గెంటేసిన అమానుష ఘటన రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం గాజులగూడలో చోటుచేసుకుంది. ప్రస్తుత సమాజంలో బంధాలు, అనుబంధాలు ఎంతలా దిగజారిపోతున్నాయో చెప్పడానికి ఈ ఘటనే ఒక సజీవ సాక్ష్యం.
బాధిత వృద్ధురాలి వివరాల్లోకి వెళ్తే.. గాజులగూడ గ్రామానికి చెందిన కోమటిరెడ్డి సుశీలమ్మ (82) అనే వృద్ధురాలికి 15 ఎకరాల భూమి ఉండేది. కన్న కొడుకులే కదా, తన తదనంతరం వారికే చెందుతుందని నమ్మిన ఆమె.. అందులో 13 ఎకరాల భూమిని ఇద్దరు కొడుకుల పేరిట రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చింది. అంతేకాకుండా, మిగిలిన 2 ఎకరాలను అమ్మగా వచ్చిన రూ. 2.70 కోట్ల భారీ మొత్తాన్ని సైతం తన చిన్న కొడుకు చేతిలో పెట్టింది. అమ్మ ఇచ్చిన కోట్ల కొద్దీ ఆస్తిని తీసుకున్న ఆ కొడుకులు, తీరా పంపకాలు పూర్తయ్యాక అసలు స్వరూపాన్ని బయటపెట్టారు.
ఆస్తి మొత్తం చేతికి రాగానే ఆ కొడుకులకు కన్నతల్లి శత్రువులా కనిపించింది. కనీసం పూటకూడు పెట్టడానికి కూడా మనసు రాని ఆ కొడుకులు, ఆమెను ఇంట్లో నుంచి బయటకు నెట్టేశారు. వయసు పైబడి, చేతిలో పైసా లేక, వెళ్లడానికి వేరే దారి లేని ఆ 82 ఏళ్ల వృద్ధురాలు ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో ఒక చెట్టు కిందే తలదాచుకుంటోంది. ఎండకు ఎండుతూ, వానకు నానుతూ కన్నీరుమున్నీరవుతున్న సుశీలమ్మ ఉదంతం స్థానికులను తీవ్రంగా కలచివేస్తోంది.
ఈ ఆధునిక కాలంలో ఆస్తుల కోసం తల్లిదండ్రులను వేధించడం, చంపడం లేదా రోడ్లపైకి గెంటేయడం వంటి దారుణాలు పెరిగిపోతున్నాయి. చిన్నప్పటి నుంచి రెక్కల ముక్కలు చేసుకుని పెంచిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో ఇలా వదిలేయడం సామాజిక విపత్తుగా మారుతోంది. ఈ నేపథ్యంలోనే బాధితురాలు సుశీలమ్మ తనకు జరిగిన అన్యాయంపై కన్నీరు పెట్టుకుంటూ, అధికారులను ఆశ్రయించింది. స్పందించిన స్థానికులు, సామాజిక కార్యకర్తలు తక్షణమే అధికారులు జోక్యం చేసుకుని, సదరు కొడుకులపై కఠిన చర్యలు తీసుకుని, ఆమెకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: మంగళవారం మూవీ లవర్స్ కు పండగే.. టీవీల్లోకి హిట్ మూవీస్..
రంగారెడ్డి: కొడుకుల చేతిలో 'మోసపోయిన అమ్మ'..!' pic.twitter.com/m8GAOv89Wo
— Publish2 (@saivijay2762104) July 13, 2026