Mancherial: మంచిర్యాల జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో వేధింపులు భరించలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు ఆ యువతి సూసైడ్ నోట్ రాసింది. దీంతో అసలు గుట్టు బయటపడింది. అసలు ఏం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి ఒక్కసారి వెళ్లొద్దాం.
మంచిర్యాల జిల్లాలో షాకింగ్ ఘటన-మంచిర్యాల జిల్లాలోని టేకుమట్ల గ్రామంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. పోలీసుల చెప్పిన వివరాల మేరకు.. గోషిక బాలేష్-రాజేశ్వరి దంపతులకు నలుగురు కూతుళ్లు-ఓ కొడుకు. నాలుగో సంతానం 26 ఏళ్ల మాధవి బీ ఫార్మసీ పూర్తి చేసింది. ఆ గ్రామానికి చెందిన వెంకటేశ్ పెళ్లి పేరుతో మాధవిని వేధించాడు. వాడు సింగరేణిలో కార్మికుడు.
ప్రేమ-పెళ్లి పేరుతో యువకుడు వేధింపులు-మాధవి తనకు ఇచ్చి వివాహం చేయకుంటే చనిపోతానని పురుగు మందు డబ్బాతో వాళ్ల ఇంటి ముందు నానా హంగామా క్రియేట్ చేశాడు. ఈ వ్యవహారం గ్రామ పెద్ద మనుషుల వద్దకు వెళ్లింది. పంచాయితీ జరిగినా వెంకటేష్ ప్రవర్తనలో మార్పు రాలేదు. తనను పెళ్లి చేసుకోకుంటే చనిపోతానని, తన చావుకు కారణం నువ్వే అవుతావని బెదిరింపులకు దిగాడు.
కొడుక్కి వత్తాసు పలికిన కుటుంబసభ్యులు- కొడుకును మందలించి దారిలో పెట్టాల్సిన వెంకటేశ్ కుటుంబ సభ్యులు, పట్టించుకోలేదు. ఫలితంగా కొడుక్కి మద్దతు పలికారు. వెంకటేష్కి ఏమైనా జరిగితే సహించబోమని యువతి కుటుంబసభ్యులను హెచ్చరించారు. జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో తీవ్ర మనస్థాపానికి గురైంది మాధవి. తన చావుకు కారణం వెంకటేష్ కారణమని పేర్కొంటూ సూసైడ్ నోట్ రాసి ఆదివారం అర్ధరాత్రి ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుంది.
ఆత్మహత్యకు పాల్పడిన యువతి-మాధవి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వెంకటేశ్-అతడి తల్లి-అక్క మీద కేసు నమోదు చేశారు పోలీసులు. మాధవి చావుకు కారణమైన వెంకటేశ్ని కఠినంగా శిక్షించాలంటూ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు. ఈ ఘటనలో సూసైడ్ నోట్ కీలకంగా మారింది.
ALSO READ: కోట్ల ఆస్తి రాసిస్తే.. చెట్టు కింద నిలబెట్టారు! కన్నకొడుకుల చేతిలో మోసపోయిన కన్నతల్లి
ఆత్మహత్యకు ముందు మాధవి రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వేధించిన వెంకటేష్ కారణంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నానని రాసి ఉంది. తన మరణానికి వాడే బాధ్యుడని రాసుకొచ్చింది. బలవన్మరణానికి కారణమైన వ్యక్తిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని రాసినట్లు తెలుస్తోంది.