SajjanarIPS: హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ (IPS) నుమయిష్ ఎగ్జిబిషన్ ప్రాముఖ్యతతో పాటు, ఇటీవల వార్తల్లో నిలిచిన జర్నలిస్టుల అరెస్టులపై కీలక వ్యాఖ్యలు చేశారు. 1938లో ప్రారంభమైన నుమయిష్కు 80 ఏళ్ల చరిత్ర ఉందని గుర్తుచేస్తూ, ప్రజల్లో భద్రత పట్ల అవగాహన పెంచేందుకు పోలీస్ శాఖ తరపున ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.
జర్నలిస్టుల అరెస్టుల వ్యవహారంపై సీపీ సజ్జనార్ సూటిగా స్పందించారు. ఒక మహిళా అధికారిణిని, అలాగే ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకుని నిరాధారమైన, అవమానకరమైన వార్తలు ప్రసారం చేసినందుకే చట్టపరమైన చర్యలు తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ప్రజా జీవితంలో విమర్శలు సహజం, కానీ అవి వ్యక్తిగత గౌరవాన్ని కించపరిచేలా ఉండకూడదు. ఎటువంటి ఆధారాలు లేకుండా మహిళా అధికారులపై ఆరోపణలు చేయడం క్రూరత్వం” అని పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్న తరుణంలో వారిని నిరాధారంగా విమర్శిస్తే కుటుంబాలు విచ్ఛిన్నమవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు.
అరెస్టుల విషయంలో నిబంధనలు పాటించలేదని వస్తున్న విమర్శలను ఆయన తోసిపుచ్చారు. “చట్టం తన పని తాను చేసుకుపోతుంది. విచారణకు పిలిస్తే సహకరించాలి తప్ప, అర్థరాత్రి బ్యాంకాక్ పారిపోయే ప్రయత్నం చేయడం ఎందుకు? తప్పు చేయకపోతే విచారణకు రావాలి” అని ఆయన ప్రశ్నించారు. ఈ కేసులో ప్రముఖ టీవీ ఛానెళ్ల రిపోర్టర్లను అదుపులోకి తీసుకున్నామని, ఎవరైనా సరే చట్టానికి అతితీతులు కాదని హెచ్చరించారు.
రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. “ఎమర్జెన్సీ వస్తే పరిస్థితులు వేరేలా ఉంటాయి, మీరందరూ ఇలా ప్రశాంతంగా ఉండేవారు కాదు” అని జర్నలిస్టులకు గుర్తుచేశారు. మహిళలను అగౌరవపరచడం అంటే సృష్టికి మూలమైన అమ్మను అగౌరవపరచడమేనని, ఇలాంటి విషయాల గురించి మాట్లాడాల్సి రావడం బాధాకరమని అన్నారు. చట్టం ప్రకారం తాము చర్యలు తీసుకుంటున్నామని, విచారణకు సహకరించకపోతే అదుపులోకి తీసుకోవాల్సి ఉంటుందని ఆయన పరోక్షంగా హెచ్చరించారు.
Read Also: ‘ది ఫ్యూచర్ ఈజ్ ఫీమేల్’.. మహిళలపై దుష్ప్రచారం నేరం, సీపీ సజ్జనార్ వార్నింగ్