Crude Prices: పశ్చిమాసియాలో టెన్షన్ తగ్గింది. హర్మూజ్ మళ్లీ తెరుచుకుంది. ఆయిల్ ట్యాంకర్లు కదులుతున్నాయి. క్రూడాయిల్ రేట్లు పతనమవుతున్నాయి. మరి పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గుతాయా? సామాన్యుడి రిలీఫ్ దొరుకుతుందా? ఆయిల్ మార్కెట్లు ఊపిరి పీల్చుకున్నాయి. పెరిగిన క్రూడ్ ధరలతో సతమతమైన కంపెనీలకు రిలీఫ్ దొరికింది. అమెరికా – ఇరాన్ మధ్య ఉద్రిక్తతలతో వారం క్రితం వరకు పెరుగుతూ పోయిన క్రూడాయిల్ ధరలు ఇప్పుడు తగ్గుతున్నాయి. రెండు దేశాల మధ్య తాత్కాలిక ఒప్పందం కుదరడంతో బ్రెంట్ క్రూడ్ ధర మళ్లీ యుద్ధం ముందు ఉన్న రేటుకు చేరింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర ప్రస్తుతం 72 డాలర్లకు పడిపోయింది. ఒక్క సెషన్లోనే క్రూడాయిల్ ధర 4శాతం పతనం చవిచూసింది.
పశ్చిమాసియాలో శాంతి నెలకొనడంతో చమురు రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధి తెరుచుకుంది. ఉద్రిక్తతల కారణంగా ఇన్నాళ్లూ అక్కడ నిలిచిపోయిన వందలాది ఆయిల్ ట్యాంకర్లు సురక్షితంగా బయటకు వస్తున్నాయి. ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ చొరవతో హర్మూజ్లో చిక్కుకున్న ఓడలు ఒక్కొక్కటిగా సరిహద్దులు దాటుతున్నాయి. దీంతో ఆ జలసంధి నుంచి క్రూడ్ సప్లై దాదాపు యుద్ధం ముందు స్థితికి చేరుకుంది.
యుద్ధ సమయంలో సముద్ర మార్గంలో అమర్చిన మైన్లను పూర్తిగా తొలగించాల్సి ఉంది. ఆ ప్రక్రియ పూర్తయ్యేందుకు మరికొన్ని వారాల సమయం పట్టనుంది. మైన్ల తొలగింపు పూర్తైతే.. నౌకల రవాణా పెరిగి క్రూడ్ సప్లై కూడా పెరుగుతుంది. దీనికి తోడు ఇరాన్ చమురు, పెట్రోకెమికల్ ఎగుమతులపై అమెరికా ఆంక్షలను తాత్కాలికంగా ఎత్తివేసింది. దీంతో మార్కెట్లోకి మరింత చమురు అందుబాటులోకి వచ్చింది. జూన్ 15తో ముగిసిన వారంలో మిడిల్ ఈస్ట్ నుండి ఏకంగా 6.79 మిలియన్ బ్యారెళ్ల చమురు రవాణా జరిగింది. ఇది మే 1 తర్వాత నమోదైన అత్యధిక రికార్డు అని మారిటైమ్ ఇంటెలిజెన్స్ సంస్థ విండ్వర్డ్ ప్రకటించింది.
Also read: Drug Rehabilitation: చంచల్గూడ, చర్లపల్లి ఖైదీలు ఎం చేసారో తెలిస్తే మీ మైండ్ బ్లాకే..?
బ్యారెల్ ధర 72 డాలర్లకు పడిపోయింది.. మరి పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గుతాయా? సామాన్యుడిలో మదిలో ప్రస్తుతం ఇదే ప్రశ్న మెదులుతోంది. భారత చమురు అవసరాల్లో దాదాపు 85 శాతం దిగుమతులపైనే ఆధారపడుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గితే, దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలైన HPCL, BPCL, IOCLలపై అదనపు భారం పెరుగుతుంది. హర్మూజ్ మూతపడిన సమయంలో ఆయిల్ కంపెనీలు నష్టాలు భరించాయి. సంక్షోభం కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతాయని అంతా భావించారు. కానీ చమురు కంపెనీలు మార్జిన్లను భారీగా తగ్గించుకుని కస్టమర్లపై తక్కువ భారమే మోపారు.
హర్మూజ్ నుంచి ఆయిల్ ట్యాంకర్లు బయలుదేరినా అవి గమ్య స్థానాలకు చేరేందుకు కొంత సమయం పట్టనుంది. క్రూడ్ను శుద్ధి చేసి మార్కెట్లోకి తెచ్చేందుకు కనీసం నెల నుంచి నెలన్నర సమయం పడుతుందని అంచనా. ఈ లెక్కన ఆయిల్ కంపెనీల మార్జిన్లు మళ్లీ యుద్ధం ముందు స్థాయికి చేరేందుకు టైం పడుతుంది. మరోవైపు ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ధరలు 70 నుంచి 75 డాలర్ల మధ్య స్థిరంగా కొనసాగితేనే ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించే ఛాన్సుందని మార్కెట్ అనలిస్టులు అంటున్నారు. అయితే ఆ తగ్గింపు భారీ స్థాయిలో ఉండకపోవచ్చని చెబుతున్నారు.
Storey By: Anup Big Tv
Also Read: రేసింగ్ కార్ డిజైన్తో ఇన్ఫినిక్స్ కొత్త ఫోన్ లాంచ్.. ఫీచర్లు నెక్ట్స్ లెవెల్!