Drug Rehabilitation: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న యాంటీ డ్రగ్స్ వీక్ కార్యక్రమంలో భాగంగా గురువారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జైళ్లలో మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు. ఖైదీల్లో మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించడం, ఆరోగ్యకర జీవన విధానాలను ప్రోత్సహించడం, పునరావాస కార్యక్రమాలను బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమాలు నిర్వహించినట్లు జైళ్ల శాఖ డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా తెలిపారు.
చంచల్ గూడ సెంట్రల్ జైళ్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సౌమ్య మిశ్రా నివృత్తి’ డీ-అడిక్షన్ సెంటర్ అధికారిక లోగోను ఆవిష్కరించారు. మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, నివారణ, చికిత్స, పునరావాసంపై ఖైదీలు, సిబ్బంది, సందర్శకుల్లో అవగాహన పెంపొందించే పోస్టర్లను కూడా విడుదల చేశారు. ఇక, రాష్ట్రంలోని అన్ని జైళ్లలో అవగాహన సదస్సులు, కౌన్సెలింగ్ కార్యక్రమాలు, ప్రేరణాత్మక ప్రసంగాలు, ప్రతిజ్ఞా స్వీకారాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. హైదరాబాద్, చర్లపల్లి, నిజామాబాద్, సంగారెడ్డి కేంద్ర కారాగారాలు, మహిళల ప్రత్యేక జైలులోని ‘నివృత్తి’ డీ-అడిక్షన్ కేంద్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు.
గత ఏడాది జూలై నుంచి ఈ ఏడాది జూన్ వరకు నాలుగు కేంద్ర కారాగారాల్లోని డీ-అడిక్షన్ కేంద్రాల ద్వారా మొత్తం 15,645 మంది ఖైదీలకు కౌన్సిలింగ్ అందించినట్లు జైళ్ల శాఖ అధికారులు వెల్లడించారు. వీరిలో 12,675 మంది (81 శాతం) ఖైదీలకు జైలుకు వచ్చిన సమయంలోనే మాదకద్రవ్యాల వినియోగంపై స్క్రీనింగ్ నిర్వహించారు. అందులో 4,200 మంది మాదకద్రవ్యాలు సేవిస్తున్నట్టు నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో వారికి పునరావాస సేవలు అందించారు. దీంట్లో భాగంగా 4,100 వ్యక్తిగత కౌన్సెలింగ్ సమావేశాలు, 1,150 ఫాలో అప్ కౌన్సెలింగ్ లు, 507 సైకోఎడ్యుకేషన్-గ్రూప్ సెషన్లు, 317 అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జైలు నుంచి విడుదలైన 550 మందికి ఫోన్ ద్వారా ఫాలో అప్ సేవలు అందించారు.
Also read: Crop Burning: హైదరాబాద్కు డేంజర్ బెల్స్.. సాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ నిజాలు..?
స్క్రీనింగ్లో అత్యధికంగా 1,563 మంది గంజాయి సేవించటానికి అలవాటు పడ్డారని వెళ్లడయ్యింది. మరో 815మంది కల్తీ కల్లుకు బానిసలుగా మారినట్టు తెలిసింది. ఇక, 160మంది సెడేటివ్ మాత్రలు, 72మంది సెడేటివ్ ఇంజెక్షన్లు, 60మంది ఎండీఎంఏ, 40మంది మెథాంఫెటమైన్, 33మంది ఎల్ఎస్డీ, 31మంది కొకైన్, 50మంది ఓపీఎం తీసుకుంటున్నట్టు తేలింది. వీరందరికి జైళ్లలోని డీ అడిక్షన్ కేంద్రాల ద్వారా కౌన్సిలింగ్ ఇచ్చారు. చంచల్ గూడ సెంట్రల్ జైళ్లో జరిగిన కార్యక్రమంలో ఐజీ మురళీబాబు, సూపరింటెండెంట్ నవాబ్ శివకుమార్ గౌడ్ తోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
జూన్ 26న ఐక్యరాజ్యసమితి మాదకద్రవ్యాలు, నేరాల నియంత్రణ సంస్థ (యూఎన్వోడీసీ), టర్న్ యువర్ కన్సర్న్ ఇన్ టూ యాక్షన్ ఫౌండేషన్ (టీవైసీఐఏ) ఆధ్వర్యంలో పంజాబ్ జైళ్ల శాఖ సహకారంతో నిర్వహించే ‘డ్రగ్స్, హెచ్ఐవీ అండ్ ప్రిజన్ హెల్త్ రెస్పాన్సెస్’ జాతీయ సదస్సులో తెలంగాణ జైళ్ల శాఖ డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ జైళ్లలో అమలు చేస్తున్న ‘నివృత్తి’ డీ-అడిక్షన్ కేంద్రాల ఉత్తమ విధానాలపై ఆమె ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. స్క్రీనింగ్, చికిత్స, కౌన్సెలింగ్, ఫాలోఅప్, సామాజిక పునరావాస కార్యక్రమాల్లో తెలంగాణ జైళ్ల శాఖ అమలు చేస్తున్న వినూత్న విధానాలను దేశంలోని ఇతర రాష్ట్రాలతో పంచుకోనున్నారు. డీజీతో పాటు డీఐజీ సంపత్ కూడా ఈ జాతీయ సదస్సులో పాల్గొంటారు. యూఎన్వోడీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ జాతీయ వేదికలో తెలంగాణ జైళ్ల శాఖకు ప్రజెంటేషన్ అవకాశం లభించడం, రాష్ట్రంలో అమలవుతున్న ‘నివృత్తి’ డీ-అడిక్షన్ కార్యక్రమాలకు లభించిన జాతీయ గుర్తింపుగా అధికారులు పేర్కొన్నారు.
Also read: అమెజాన్ బంపరాఫర్.. సగం ధరకే రోబోటిక్ క్లీనర్లు.. ఒక్క బటన్తో ఇల్లంతా క్లీన్!