తనను తాను ఆవిష్కించుకున్నారు మరోసారి సీఎం రేవంత్రెడ్డి. రవీంద్ర భారతి వేదికగా.. ఉద్యోగులకు ప్రమాద బీమా చేపించిన సందర్భంగా ఏర్పాటు చేసిన మీటింగు సాక్షిగా ఆయన తన పాలన ప్రోగ్రెస్ రిపోర్టును చూచాయగా బయటపెట్టారు. ప్రధాన ప్రతిపక్షం సృష్టిస్తున్న అవరోధాలను, ఆటంకాలను ఏకరువు పెట్టారు. తన చేతికి వచ్చే నాటికి పాలన ఏ రకంగా విధ్వంసమై కూర్చుందో గుర్తు చేశారు.
సీఎంగా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి నేటి వరకు ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా నిరంతరంగా శ్రమిస్తున్న తీరును కళ్ల ముందుంచారు. అలుపెరగకుండా తెలంగాణ జాతి శ్రేయస్సు కోసం పడుతున్న తపనను, తండ్లాటను చెప్పే ప్రయత్నం చేశారు. ఉద్యోగుల మద్దతును కూడగట్టుకుని ముందుకు సాగుతున్న క్రమాన్నీ వివరించారు. తనదైన మార్కును తెలంగాణ అభివృద్ధిలో భాగంగా ఎలా తీసుకు రావాలో , దాని కోసం చేస్తున్న భగీరథ ప్రయత్నమెలా ఉందో.. చెబుతూనే.. అధికారం కోల్పోయిన ఆ కుటుంబం తనను ఎలా వెంటాడుతుందో గుర్తు చేశారు.
మాకు దక్కనిది ఇంకెవరికీ దక్కనివ్వను.. అనే పైశాచికత్వంతో అడుగడుగునా తన కాళ్లకు అడ్డం పడుతున్న ఆ నలుగురి గురించి చర్చించారు. మమ్మల్ని ఓడగొట్టినందుకు మీకు తగిన శాస్తి కావాల్సిందే.. అనుభవించండి.. ! అని చివరకు ప్రజల మీదా ప్రతీకారం తీర్చుకునేలా బీఆరెస్ నేతల ప్రవర్తన ఉందనే విషయాన్ని తెలంగాణ ప్రజల ముందుంచారు. పదే పదే ఢిల్లీకి ఎందుకు పోతున్నావ్.. ? అని నిలదీసిన నోళ్లకు.. నాకు తెల్వని ఢిల్లీనా? కాలుష్యం తప్ప ఏముందక్కడా..? లడ్డూ ఏమైనా ఉందా? నేనెందుకు పోతున్నానో తెలవదా? అని ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. ఎక్కువ మిత్తీలకు అప్పులు తెస్తే .. ఆ భారం మోయలేక దాన్ని తగ్గించే మార్గాలు వెతుక్కునే పనికి ఢిల్లీకి పోతున్నానన్నారు.
అది చేసి చూపించిన వైనాన్ని కళ్ల ముందుచారు. చాకచక్యంతో పెండింగ్ ప్రాజెక్టుల సాధనకు లైన్ క్లియర్ చేసుకునేందుకు వెళ్తున్నానన్నారు. తన శ్రమకు దగ్గిన ఫలితాన్నీచవి చూపారు. చివరగా .. అవును..! నేను గుంపు మేస్త్రీనే.. అని గర్వంగా చెప్పుకున్నారు. అందరితో కలిసి పనిచేస్తాను.. చిన్నవాడినైనా అందరి అనుభవాలను పాఠాలుగా తీసుకుని పాలన చేస్తాను… మీరంతా నా గుంపు.. నా గుంపే నాకు కొండంత అండ.. ఆ గుంపుకు నేను మేస్త్రీని.
గుంపుమేస్త్రీని… అని తనను అవహేళన చేసిన వారికి గర్వంగా చెప్పుకున్నారు. పదవులు శాశ్వతం కాదు.. నేను ఎప్పటికీ మీ రేవంతన్ననే.. సారు, దొర పలుకులు నా ఒంటికి పడవు..! అని అందరిలో ఒకడిలా కలిసిపోయారు. నేను నాలాగే ఉన్నా.. ఇప్పుడు వచ్చిన ఈ పదవి.. నాకు ఎప్పటికీ మరిచిపోనిది.. నిద్ర పోయేటప్పుడు.. నిద్ర లేవగానే గురుతర బాధ్యతను గుర్తు చేసుకుంటాను.. కర్తవ్య నిర్వహణకు ప్రాణాలు పెడతాను.. ఇందులో సందేహం లేదని అందరి మనసులను తట్టారు రేవంత్.