Danam Nagender: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వ్యవహారంపై హైకోర్టులో కీలక వాదనలు జరిగాయి. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరడంపై దాఖలైన పిటిషన్లపై ధర్మాసనం విచారణ జరిపింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే కాంగ్రెస్ బీ-ఫామ్తో.. సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి పోటీచేయడం ఈ కేసులో కీలకంగా మారింది. బుధవారమే తీర్పు వెలువరించాల్సి ఉండగా.. శుక్రవారానికి వాయిదా వేసింది.
స్వీకర్ వాదనని వ్యతిరేకించిన పిటిషనర్లు..
పార్టీ ఫిరాయింపులను నిర్ధారించేందుకు.. అసెంబ్లీ లోపల ఎమ్మెల్యే వ్యవహరించిన తీరును మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలన్న స్పీకర్ వాదనని పిటిషనర్లు వ్యతిరేకించారు. వేరే పార్టీ తరఫున పోటీ చేసినప్పుడు.. ఇతర ఆధారాలేవీ అవసరం లేదని, స్పీకర్ అధికారాలు కూడా న్యాయపరమైన పరిశీలనకు లోబడి ఉంటాయని స్పష్టం చేశారు. మరోవైపు.. దానం నాగేందర్ తరఫు లాయర్ ఈ వాదనని ఖండించారు. అసెంబ్లీ రికార్డుల్లో ఇప్పటికీ తాను బీఆర్ఎస్ సభ్యుడిగానే ఉన్నారనే వాదన వినిపించారు. ఆయన అధికారికంగా బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయలేదని, కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్నట్లు కూడా ఎక్కడా ప్రకటించలేదని వాదించారు. కాంగ్రెస్ తరఫున లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసినంత మాత్రాన.. అసెంబ్లీ సభ్యత్వం కోల్పోయినట్లు భావించరాదని కోర్టుకు తెలిపారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. తుది తీర్పుని శుక్రవారానికి వాయిదా వేసింది.
స్వీకర్ నిర్ణయానికి సవాల్..
స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ.. కోర్టును ఆశ్రయించిన అనర్హత పిటిషన్పై హైకోర్టు ఇవ్వబోయే తీర్పు.. తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి భూకంపం సృష్టిస్తుందోననే ఉత్కంఠ నెలకొంది. పార్టీ ఫిరాయింపులు, స్పీకర్ అధికారాల పరిధిపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తున్న వేళ.. హైకోర్టు తీర్పు రానుంది. రాబోయే రోజుల్లో పార్టీ ఫిరాయింపుల కేసులకు.. ఇదే కీలకంగా మారే అవకాశముంది.
Also Read: కోట్లలో ముంచారు.. మళ్లీ అదే బాధితులకు వల! 400 డాలర్ల పేరుతో సైబర్ కేటుగాళ్ల కొత్త మోసం