KTR: 2028 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో ఎలాంటి పొత్తు ఉండదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఒంటరిగానే బీఆర్ఎస్ పోటీ చేస్తుందని పేర్కొన్నారు. హర్యానా సోనిపట్ లోని ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో ‘ఇన్నోవేషన్ ఇన్ గవర్నెన్స్ – ది స్టోరీ ఆఫ్ ఏ స్టార్టప్ స్టేట్’ అనే అంశంపై కేటీఆర్ మాట్లాడారు. అనంతరం విద్యార్థులతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని రాజకీయాలు, పాలన, సాంకేతికత తదితర అంశాలపై వారి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
లోక్సభ స్థానాల సంఖ్యను దేశవ్యాప్తంగా దామాషా ప్రకారం పెంచితే, డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వడంలో బీఆర్ఎస్కు ఎలాంటి అభ్యంతరం ఉండదని కేటీఆర్ తెలిపారు. మరోవైపు నిర్దిష్టత, అవకాశాలు అనే రెండు కాన్సెప్ట్ల ద్వారా తెలంగాణ అభివృద్ధి నమూనాను వివరించారు. మౌలిక వసతులు, విశ్వసనీయమైన ప్రజా సేవల ద్వారా ప్రభుత్వం ప్రజలకు ఒక నిర్దిష్టమైన వాతావరణం కల్పించాలన్నారు. అదే సమయంలో ఇన్నోవేషన్, వ్యవస్థాపకతను ప్రోత్సహిస్తూ ఒక కొత్త ఇకోసిస్టమ్ను సృష్టించి, కొత్త అవకాశాలకు అనుకూలమైన వాతావరణాన్ని కూడా నిర్మించాలన్నారు.
A day well spent with bright, young students today in Sonipat, Haryana.
Delivered a lecture on ‘Innovation in Governance: The Story of a Startup State’ at O.P. Jindal Global University.
Taking the opportunity, I highlighted the BRS government’s initiatives in irrigation,… pic.twitter.com/bl3d0dYvhU
— KTR (@KTRBRS) September 16, 2026
సాగునీరు, వ్యవసాయం, తాగునీరు, విద్యుత్ రంగాల్లో తెలంగాణ చేపట్టిన వివిధ కార్యక్రమాల గురించి ఈ సందర్భంగా కేటీఆర్ వివరించారు. అలాగే టీ-హబ్, వీ-హబ్, టీ-వర్క్స్, టాస్క్ వంటి సంస్థల పాత్రను ప్రస్తావించారు. వ్యవస్థాపకతను ప్రోత్సహించడం, మహిళలకు అవకాశాలు కల్పించడం, యువతను పరిశ్రమలతో అనుసంధానం చేయడంలో ఆయా సంస్థల పాత్రను పేర్కొన్నారు. ఇంక్యుబేషన్, నమూనా రూపకల్పన నుంచి మార్కెట్కు సిద్ధమైన సంస్థగా ఎదిగిన స్కైరూట్ను తెలంగాణ ఇన్నోవేషన్ వ్యవస్థకు ఉదాహరణగా ప్రస్తావించారు.
మరోవైపు న్యూఢిల్లీలోని ఇండియా హ్యాబిటాట్ సెంటర్లో జనాగ్రహ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘షెహెరోన్ పే చర్చా’ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజలు ఏదైనా సమస్యతో నాయకుల వద్దకు వచ్చినప్పుడు దానికి సమగ్ర, దీర్ఘకాలిక పరిష్కారం చూపించాలన్నారు. సమస్య వచ్చిన వెంటనే హడావుడిగా స్పందించడం, తాత్కాలిక చర్యలు చేపట్టడం సరిపోదన్నారు. హైదరాబాద్పై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించేందుకు అప్పటి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను ఆయన ప్రస్తావించారు.
Also Read: ‘అప్పుడు నీ బుద్ధి ఏమైంది?’.. హరీశ్రావుపై మంత్రి పొంగులేటి నిప్పులు!
విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలను హైదరాబాద్కు వెలుపల కూడా అభివృద్ధి చేయడం ద్వారా నగరంపై ఒత్తిడిని తగ్గించే ప్రయత్నం చేసినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. హైస్పీడ్ రైలు నెట్వర్క్ను అభివృద్ధి చేయడం ద్వారా పెద్ద నగరాలపై రవాణా, జనాభా ఒత్తిడిని తగ్గించవచ్చని, వచ్చే దశాబ్దంలో ఈ దిశగా మరింత పురోగతి సాధిస్తామనే నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు నగరాలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపేందుకు వినూత్నమైన, అందరినీ భాగస్వామ్యం చేసే విధానాలను అనుసరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
Also Read: కేసీఆర్కు సొంత ఇల్లు కూడా లేదు..కానీ ఆయన వందల ఎకరాలున్న కుటుంబంలో పుట్టారు!