KCR: ప్రధాని పదవిపై సీఎం కేసీఆర్ నజర్ పెట్టారా? అందుకే మోదీ వ్యతిరేక కూటమిని తనే లీడ్ చేయాలనుకుంటున్నారా? రాబోయే ఎన్నికల్లో విపక్షాల ప్రచారానికయ్యే ఖర్చును తానే భరించడానికి రెడీ అయ్యారంటూ.. రాజ్ దీప్ బ్లాగ్ లో చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో అగ్గి రాజేశాయి. కేసీఆర్ ఆస్తులపై కాంగ్రెస్ సూటి ప్రశ్నలు సంధిస్తోంది.
రాజ్ దీప్ సర్దేశాయ్.. దేశంలోనే ఓ ప్రముఖ జర్నలిస్ట్. ఇప్పుడాయన చేసిన వ్యాఖ్యలు తెలంగాణ పాలిటిక్స్ ను షేక్ చేస్తున్నాయి. 2024 ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమికి చైర్మన్గా బాధ్యతలు అప్పగిస్తే.. మొత్తం ప్రచారానికి అయ్యే ఖర్చంతా భరిస్తానని… పార్టీ నేతలతో జరిగిన అంతర్గత సమావేశంలో కేసీఆర్ చెప్పినట్లు… రాజ్దీప్ సర్దేశాయ్ అన్నారు. ఇప్పుడీ వ్యాఖ్యలు తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారాయి.
రాజ్ దీప్ నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యల్లో నిజమెంతా? అబద్దమెంతా? అన్నది ప్రస్తుతానికి ఓ సస్పెన్సే. ప్రతిపక్ష కూటమికి చైర్మన్ అంటే… ప్రధాని పదవిపై కేసీఆర్ నజర్ పెట్టారనే చర్చ సాగుతోంది. దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలకయ్యే ఎన్నికల ఖర్చంతా భరించడం అంటే… భారీగా డబ్బు కావాలి. ఆ డబ్బంతా కేసీఆర్కు ఎక్కడిది? అన్న దానిపైన హాట్ డిబేట్ మొదలైంది.
రాజ్ దీప్ వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ స్పందించాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. ఇప్పటికే రాజ్ దీప్ చేసిన కామెంట్స్ విషయంలో సీఎం కేసీఆర్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. రాజ్ దీప్ వ్యాఖ్యలు నిజమైతే.. అంత డబ్బు సీఎం కేసీఆర్ కు ఎలా వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై కేసీఆర్ మౌనం వీడాలని.. లేదంటే ఈ వ్యాఖ్యలను నిజమని నమ్మాల్సి వస్తుందంటున్నారు మరికొందరు నేతలు.
రాజ్దీప్ వ్యాఖ్యలు ఎలా ఉన్నా.. జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని భావిస్తున్నారు కేసీఆర్. ఇందుకు తగ్గట్టుగానే TRSను BRSగా మార్చారు. కేసీఆర్ అడుగులన్ని మోదీకి వ్యతిరేకంగా వేస్తున్నవే. దీనికి తగ్గట్టుగానే జాతీయ స్థాయిలో మోదీని వ్యతిరేకించే కొన్ని విపక్ష పార్టీలతో ఐక్యతను మెయింటెన్ కూడా చేస్తున్నారు. చాలా రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. అయితే ఆ పర్యటనల్లోనే విపక్ష నేతలతో ఈ వ్యాఖ్యలు చేశారా? అన్న డౌటనుమానాలు వస్తున్నాయి. నిప్పు లేనిదే పొగ రాదన్న సామెతకు అనుగుణంగా రాజ్ దీప్ వ్యాఖ్యలను చూడాలంటున్నారు హస్తం పార్టీ నేతలు.