Family Death: వరుస మరణాలు ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. భార్య మృతిని తట్టుకోలేక భర్త తనువు చాలించాడు. కుమారుడి మరణం తాళలేక తల్లి ప్రాణాలు విడిచింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నేదునూరులో చోటుచేసుకుంది.
వివాహమైన 4 నెలలకే భార్య తన పుట్టింటి దగ్గర ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అదే ప్రదేశంలో సరిగా పెళ్లి రోజుకు ముందు భర్త శ్యాంసుందర్ ప్రాణాలు తీసుకున్నాడు. భార్యాభర్తలు కొంతకాలం అన్యోన్యంగా ఉన్నారు. పుట్టింటికి వచ్చిన శారద గతేడాది సెప్టెంబరు 20న ఇంటి ముందున్న చెట్టుకు ఉరి వేసుకుంది. ఆమె మానసిక స్థితి సరిగా లేక ఈ దారుణానికి పాల్పడిందని నాడు ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
భార్య మరణంతో ఒంటరి జీవితం భరించలేక మే 15న పెళ్లి రోజు కాగా.. ముందురోజు రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్దిపేటలోని అత్తవారింటి ముందు తన భార్య ఉరేసుకున్న చెట్టు కిందనే పురుగు మందు తాగి పడిపోయి మృతి చెందాడు.
శ్యాంసుందర్ మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు కుటుంబ సభ్యులు. కొడుకు మరణాన్ని తల్లి తట్టుకోలేకపోయింది. కొడుకు అంత్యక్రియల అనంతరం గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయింది. వరుస మరణాలతో ఇరు కుటుంబాలతో పాటు గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.