Telangana Municipal Elections: బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులకు గడ్డు పరిస్థితి నెలకొంది. అధికారంలో ఉన్న సమయంలో ఉమ్మడి జిల్లాలో అన్ని తానై వ్యవహరించారు. పార్టీ అధినేత కేసీఆర్ సైతం వారికే బాధ్యతలు అప్పగించింది. ఉమ్మడి జిల్లాల వారీగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమీక్షా సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేశారు. గెలుపు బాధ్యతలను అప్పగించారు. అయితే ఆ సమీక్షలకు జిల్లాల్లో ఉన్న సీనియర్ నేతలను కాకుండా వారికి అనుకూలంగా ఉన్నవారితోనే కొంతమంది మాజీ మంత్రులు తీసుకొచ్చారు. అంతేకాదు మున్సిపాలిటీలకు సైతం వారి అనుచరులకే ఇన్ చార్జీ బాధ్యతలు అప్పగించుకున్నారు. గెలిపించుకుంటామని పార్టీకి హామీలు ఇచ్చారు. అయితే మున్సిపల్ ఫలితాల్లో వారు ఏమేరకు పార్టీని విజయతీరాలకు తీసుకెళ్లారనేది స్పష్టమవుతోంది. వారిపై ఉన్న వ్యతిరేకత వల్లనే పార్టీకి గడ్డుపరిస్థితి అనేది వెల్లడైంది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ , ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు పార్టీ గెలుపు బాధ్యతలను పార్టీ అధిష్టానం అప్పగించింది. అయితే ఈజిల్లాలో 7 మున్సిపాలిటీలు ఉన్నప్పటికీ ఒక్కదాంట్లో సైతం విజయం సాధించలేదు. ప్రచారం చేశారు.. కానీ ఫలితాలను రాబట్టడంలో మాత్రం విఫలం అయ్యారనేది స్పష్టమవుతోంది. అదే విధంగా ఉమ్మడి నల్లగొండలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. 19 మున్సిపాలిటీలు ఉండగా అందులో నకిరేకల్ మినహా 18 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. ఒక తిరుమలగిరి మున్సిపాలిటీలో మాత్రమే బీఆర్ఎస్ విజయం సాధించింది. నల్లగొండ కార్పొరేషన్ లో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ పోటీ ఇవ్వలేదు. అంతేకాదు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సొంత నియోజకవర్గకేంద్రంలోని సూర్యాపేట మున్సిపాలిటీలో 48 వార్డులు ఉండగా 11 స్థానాల్లో మాత్రం బీఆర్ఎస్ విజయం సాధించింది.
గెలుస్తామని ధీమాతో పార్టీ అభ్యర్థులను క్యాంపునకు సైతం తరలించినట్లు సమాచారం. ఈ ఫలితంతో జగదీష్ రెడ్డి ప్రభావం ఏమేరకు ఉన్నదనేది స్పష్టమైందని పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 13 మున్సిపాలిటీలు ఉండగా ముడింటిలో మాత్రమే విజయం సాధించింది. ఈ జిల్లాలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సైతం ప్రభావం చూపకలేకపోయింది. ఉమ్మడి మహబూబ్ నగర్ లో 18 మున్సిపాలిటీలు ఉండగా 4 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. ఇక్కడ మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి ప్రచారం చేసినప్పటికీ ఎక్కువ స్థానాల్లో విజయం సాధించలేకపోయారు. ఆదిలాబాద్ జిల్లాలోని 10 మున్సిపాలిటీల్లో 1 స్థానం మాత్రమే విజయం సాధించారు. మాజీ మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి ఉన్నప్పటికీ ప్రభావం చూపలేదు.
అదే విధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 మున్సిపాలిటీల్లో 1 స్థానంలో మాత్రమే విజయం సాధించింది. సిరిసిల్ల, జమ్మికుంటలో మాత్రమే విజయం సాధించారు. ఇక్కడ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి గంగుల కమలాకర్ విస్తృత ప్రచారం చేశారు. కానీ ఆశించిన స్థాయిలో ఫలితం రాబట్టలేకపోయారనేది ఇప్పుడు పార్టీలో జరుగుతుంది. గంగుల తమకు టికెట్లు ఇవ్వలేదని పార్టీ నాయకులు నిరసన తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మున్సిపాలిటీలకు గాను జనగాం, తొర్రూరు మున్సిపాలిటీల్లో మాత్రమే విజయం సాధించింది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రచారం చేసినప్పటికీ ఆయనకు కలిసి రాలేదు. ఈ ఎన్నికలు వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు నాంది అని బీఆర్ఎస్ ప్రచారం చేసినప్పటికీ గెలుపు ముగింట చతికిలపడింది.