Dubai Lottery: అదృష్టం ఎప్పుడు, ఎవరిని, ఎలా వరిస్తుందో ఊహించడం చాలా కష్టం. అలాంటి ఆ లక్.. హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్తను వరించింది. రాత్రికి రాత్రే అతడిపై కనక వర్షం కురిపించింది. యూఏఈలోని షార్జాలో స్థిరపడిన 45 ఏళ్ల మహ్మద్ అయ్యూబుద్దీన్.. బుధవారం (జూలై 15) జరిగిన ప్రముఖ ‘దుబాయ్ డ్యూటీ ఫ్రీ’ (DDF) మిలీనియం మిలియనీర్ డ్రాలో విజేతగా నిలిచారు. ఏకంగా 1 మిలియన్ యూఎస్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 9.62 కోట్లు) ఆయన గెలుచుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
షార్జాలో ఉంటున్న మహ్మద్ అయ్యూబుద్దీన్.. ఈ నెల 3వ తేదీన ఆన్లైన్ ద్వారా 4144 నంబర్ గల లాటరీ టికెట్ కొన్నారు. బుధవారం నిర్వహించిన ‘మిలీనియం మిలియనీర్ సిరీస్ 549 డ్రా’లో ఆ నెంబర్ టాప్ ప్రైజ్ కైవసం చేసుకుంది. మహ్మద్ అయ్యూబుద్దీన్ 2006 నుండి షార్జాలో నివసిస్తూ లైటింగ్ ఫిట్టింగ్స్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. నలుగురు పిల్లల తండ్రి అయిన ఆయన.. గత 8 నుండి పదేళ్లుగా క్రమం తప్పకుండా ఈ దుబాయ్ డ్యూటీ ఫ్రీ ప్రమోషన్లో పాల్గొంటున్నారు. ఈ సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు ఆయనను విజయం వరించింది.
ఈ సందర్భంగా అయ్యూబుద్దీన్ మాట్లాడుతూ.. ‘గడిచిన రెండు రోజులుగా నేను ఖచ్చితంగా గెలుస్తాననే బలమైన నమ్మకం నాలో కలిగింది. ఈ ప్రమోషన్ ఎంతో మంది జీవితాలను మార్చేసింది. పట్టువదలక ప్రయత్నిస్తే ఏదో ఒకరోజు అందరికీ అవకాశం వస్తుంది’ అని ఆనందం వ్యక్తం చేశారు. అయ్యూబుద్దీన్ విజయంతో 1999లో ప్రారంభమైన ఈ లాటరీ స్కీమ్లో ఇప్పటివరకు విజేతలుగా నిలిచిన భారతీయుల సంఖ్య 280కి చేరింది. ఇప్పటివరకూ ఈ టికెట్లు కొనుగోలు చేసిన వారిలో భారతీయులే అగ్రస్థానంలో కొనసాగుతుండటం విశేషం.
ఇదే డ్రాలో మరొకరికి కూడా అదృష్టం కలిసివచ్చింది. దుబాయ్లో అసిస్టెంట్ ఫైనాన్స్ మేనేజర్గా పనిచేస్తున్న పాకిస్తాన్కు చెందిన హీరా నయ్యర్ (38) కూడా 1 మిలియన్ డాలర్ల బహుమతిని గెలుచుకున్నారు. సిరీస్ 550లో భాగంగా ఆమె ఆన్లైన్లో కొనుగోలు చేసిన 1387 నంబర్ టికెట్కు ఈ ప్రైజ్ దక్కింది. అయితే ఆమె ఈ లాటరీలో పాల్గొనడం ఇదే మొదటిసారి కావడం విశేషం. తన సహోద్యోగి సలహాతో తన చార్టర్డ్ అకౌంటెంట్ (CA) మెంబర్షిప్ నంబర్ను పోలి ఉన్న టికెట్ను ఆమె ఎంచుకున్నారు. పాక్ లోని లాహోర్కు చెందిన హీరా నయ్యర్.. ఈ మిలీనియం మిలియనీర్ బహుమతిని గెలుచుకున్న 29వ పాకిస్తాన్ పౌరురాలిగా నిలిచారు.
Also Read: బాత్రూమ్లోకి వెళ్తే చాలు.. అంతా అదే చూసుకుంటుంది.. షావోమీ అద్భుత స్మార్ట్ హీటర్ లాంచ్!
మిలియన్ డాలర్ల డ్రాతో పాటు జరిగిన ‘ఫైనెస్ట్ సర్ప్రైజ్ సిరీస్ 671’ డ్రాలో అజ్మాన్లో నివసిస్తున్న మహ్మద్ రషీద్ (34) అనే మరో భారతీయుడిని అదృష్టం వరించింది. దుబాయ్లో ఇన్సూరెన్స్ బ్రోకర్గా పనిచేస్తున్న రషీద్.. గత మూడేళ్లుగా ఈ ప్రమోషన్లో పాల్గొంటున్నారు. తాజా డ్రాలో ఆయన అత్యంత ఖరీదైన ‘డుకాటీ పానిగాలే V2S’ (Ducati Panigale V2S) మోటార్ సైకిల్ను గెలుచుకున్నారు. ఒకే రోజు ఇద్దరు భారతీయులకు భారీ బహుమతులు దక్కడంతో ప్రవాస భారతీయుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: ఫాస్ట్ ఛార్జింగ్ చేస్తున్నారా? మీ ఫోన్ సేఫేనా? నిపుణులు ఏమంటున్నారంటే!