Hyderabad: హైదరాబాద్ ఐటీ కారిడార్లో నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. ప్రముఖ ప్రాంతాలైన గచ్చిబౌలి, కొండాపూర్ పరిధుల్లో పలు గంటల పాటు కరెంట్ కట్ విధిస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు ప్రకటించారు. వర్షాకాలం ముంచుకొస్తున్న నేపథ్యంలో ముందస్తు నిర్వహణ పనులు, ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతుల కోసమే ఈ తాత్కాలిక కోత విధిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రాంతాల్లోని ఐటీ ఉద్యోగులు, స్థానికులు ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.
కొండాపూర్ పరిధిలో ఏ సమయాల్లో అంటే..?
కొండాపూర్ వైట్ ఫీల్డ్ విద్యుత్ శాఖ సబ్ డివిజన్ పరిధిలో రెండు విడతలుగా పవర్ కట్ ఉండనుంది. వైట్ ఫీల్డ్ ఏఈ కిశోర్ అందించిన వివరాల ప్రకారం… ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు న్యూ పీజేఆర్ నగర్, జనార్దన్ హిల్స్, బాబుఖాన్ లేన్ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. ఆ తర్వాత రెండో విడతలో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వైట్ ఫీల్డ్, అంజయ్యనగర్ కాలనీల్లో కరెంట్ కోత ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.
గచ్చిబౌలి, టెలికాం నగర్లలో సుదీర్ఘంగా..
మరోవైపు ఐటీ హబ్గా పేరుగాంచిన గచ్చిబౌలి డివిజన్ పరిధిలో దాదాపు 6 గంటల పాటు విద్యుత్ నిలిచిపోనుంది. గచ్చిబౌలి ఏడీఈ శివప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం… ఉదయం 9.00 గంటల నుంచే మధ్యాహ్నం 3.00 గంటల వరకు టెలీకాంనగర్, గచ్చిబౌలి ప్రధాన ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పూర్తిస్థాయిలో బంద్ కానుంది. లైన్ల మరమ్మతులు, చెట్ల కొమ్మల నరికివేత వంటి పనుల వల్లే ఈ సుదీర్ఘ కోత తప్పడం లేదని విద్యుత్ శాఖ వెల్లడించింది.
నివాసితులు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులకు అలర్ట్!
ఈ ఐటీ కారిడార్ పరిసరాల్లో పెద్ద సంఖ్యలో టెకీలు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ (WFH) చేస్తుంటారు. కాబట్టి వైఫై రూటర్లు, లాప్టాప్లకు ప్రత్యామ్నాయ పవర్ బ్యాకప్ (UPS/Inverters) చూసుకోవడం మంచిది. అలాగే గృహ వినియోగదారులు కూడా తమ రోజువారీ పనులను (వాటర్ మోటార్లు వేసుకోవడం, ఇతర అవసరాలు) ఈ లోపే పూర్తి చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. పనులు వేగంగా పూర్తయితే నిర్ణీత సమయం కంటే ముందే సరఫరాను పునరుద్ధరిస్తామని విద్యుత్ శాఖ అధికారులు భరోసా ఇచ్చారు.
Also Read: తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక ఉన్న కథ ఏంటి?