Huzurabad Bhavan: స్వేచ్చ బ్యూరో: హుజూరాబాద్ పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పూలే, డా.బి.ఆర్.అన్బేద్కర్ భవన నిర్మాణాలు గత ఎనిమిదేళ్లుగా అసంపూర్తిగా నిలిచిపోవడంపై స్థానిక బహుజన సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పాలకుల నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యంగా మారిన ఈ భవన నిర్మాణాలను తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ, త్వరలోనే స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో నిరసన దీక్షలు చేపట్టనున్నట్లు భవన నిర్మాణ కమిటీ అధ్యక్షులు వేల్పుల ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
భవన నిర్మాణానికి సంబంధించిన నేపథ్యాన్ని వేల్పుల ప్రభాకర్ ఈ సందర్భంగా వివరించారు. గత ప్రభుత్వ హయాంలో, 2018వ సంవత్సరంలో అప్పటి మంత్రి ఈటల రాజేందర్ చొరవతో ఎస్సీ కార్పొరేషన్ నిధుల నుంచి కోటి రూపాయలను ఈ భవనం కోసం మంజూరు చేశారని తెలిపారు. ఎంతో అట్టహాసంగా శంకుస్థాపన చేసినప్పటికీ.. కాంట్రాక్టర్ కేవలం పిల్లర్లు మాత్రమే లేపి, పనులను మధ్యలోనే వదిలేశారని మండిపడ్డారు. ఆ తర్వాత ఉప ఎన్నికల సమయంలోనూ, ఆ తదనంతర కాలంలోనూ అప్పటి ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, మంత్రి తన్నీరు హరీష్ రావుల దృష్టికి ఈ సమస్యను పలుమార్లు తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి పురోగతి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Also read: జియో యూజర్లకు పండగే.. రూ.798కే 100 Mbps స్పీడ్.. ఫ్రీ Zee5 సబ్స్క్రిప్షన్!
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తమకు నిరాశే ఎదురవుతోందని భవన నిర్మాణ కమిటీ నేతలు ఆరోపించారు. హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ బాబు చుట్టూ, ఇతర మంత్రుల చుట్టూ గత రెండున్నరేళ్లుగా తిరుగుతూ వినతిపత్రాలు ఇస్తున్నా ఫలితం శూన్యమైందని పేర్కొన్నారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఈ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినప్పటికీ, స్థానిక నాయకత్వం మరియు అధికారుల నుంచి సరైన స్పందన కరువైందని వారు ఆరోపించారు.
పాలకుల మరియు అధికారుల ఉదాసీనత వల్లే బహుజన మహాపురుషుల భవన నిర్మాణం మధ్యలో ఆగిపోయింది. ఇకనైనా ప్రభుత్వం స్పందించి పనులు అధికారికంగా ప్రారంభించే వరకు మా పోరాటం ఆగదు. త్వరలోనే అంబేద్కర్ చౌరస్తా సాక్షిగా ప్రతిరోజూ నిరసన దీక్షలు కొనసాగుతాయని వేల్పుల ప్రభాకర్, భవన నిర్మాణ కమిటీ అధ్యక్షులు అన్నారు. భవన నిర్మాణ పనులు క్షేత్రస్థాయిలో ప్రారంభమయ్యేంత వరకు కలిసికట్టుగా పోరాడతామని కమిటీ స్పష్టం చేసింది. ఈ న్యాయమైన పోరాటానికి హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రజాస్వామ్యవాదులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల నాయకులు, బహుజన సమాజం మరియు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి పూర్తి మద్దతు ప్రకటించాలని, దీక్షలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Also read: రాముడి సొమ్ము దోచిన వారికి లాయర్లు లేరు! అయోధ్య బార్ అసోసియేషన్ సంచలన తీర్మానం!