Ramchander Rao: స్వేచ్ఛ బ్యూరో: రాబోయే వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని, ఆ స్థానం తమదేనని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ధీమా వ్యక్తంచేశారు. వరంగల్ లో సోమవారం నిర్వహించిన బీజేపీ బూత్ అధ్యక్షుల సమావేశానికి రాంచందర్ రావు హాజరై మాట్లాడారు. ఒకప్పుడు వరంగల్ బీజేపీకి బలమైన కేంద్రంగా ఉండేదని, ఉమ్మడి వరంగల్ జిల్లాగా ఉన్నప్పటి నుంచే పార్టీ ఇక్కడ బలంగా ఉందన్నారు. గతంలో వరంగల్లో మేయర్ పదవిని కూడా భారతీయ జనతా పార్టీ దక్కించుకుందన్నారు. అయితే చాలాకాలంగా ఎమ్మెల్యే స్థాయిలో కానీ, కార్పొరేషన్ స్థాయిలో కానీ పార్టీకి అవకాశం రాలేదని, ఈ పరిస్థితిని మార్చాల్సిన సమయం ఇప్పుడు వచ్చిందన్నారు.
వరంగల్ నిజమైన వృద్ధి
వరంగల్ నిజమైన అభివృద్ధి సాధించాలంటే ప్రస్తుత సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. ఒక వర్షం పడితేనే నగరం మొత్తం నీటమునిగే పరిస్థితి ఉండకూడదని రాంచందర్ రావు తెలిపారు. హైదరాబాద్లో ఉన్న అనేక సమస్యలు వరంగల్లో కూడా కనిపిస్తున్నాయని, ఈ పరిస్థితిని మార్చాల్సిన బాధ్యత మన అందరిదని తెలిపారు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీకి ప్రజలు అవకాశం ఇస్తే, కేంద్రంలో అమలవుతున్న అనేక అభివృద్ధి పథకాలను వరంగల్ నగరానికి తీసుకువచ్చి, ఈ నగరాన్ని ఒక అందమైన, అభివృద్ధి చెందిన నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
Also Read: పల్నాడు జిల్లాలో దొంగల బీభత్సం.. 56 తులాల బంగారం చోరీ!
గిరిజన రిజర్వేషన్ల ఆలస్యానికి కేసీఆర్ ప్రభుత్వమే
ఇదిలా ఉండగా హన్మకొండలో వికసిత్ తెలంగాణ కోసం నిర్వహించిన గిరిజన నాయకుల సమావేశానికి రాంచందర్ రావు హాజరై మాట్లాడారు. తెలంగాణలో గిరిజనుల జనాభా నిష్పత్తి ప్రకారం వారికి 10 శాతం రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ అదే బిల్లులో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ అంశాన్ని కూడా చేర్చడంతో ఆ బిల్లు న్యాయపరమైన సమస్యల్లో చిక్కుకుందన్నారు. ఫలితంగా గిరిజనులకు అందాల్సిన 10 శాతం రిజర్వేషన్ అమలు ఆలస్యమైందన్నారు. దీని వల్ల గిరిజన విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున నష్టపోయారని పేర్కొన్నారు.
తొలి పర్యటన నల్లమల అటవీ
గిరిజనుల సంక్షేమం గురించి నిజాయితీగా ఆలోచించి, వారిని అభివృద్ధి దిశగా నడిపించి, వారికి విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేసింది బీజేపీయేనని తెలిపారు. తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చేసిన తొలి పర్యటన నల్లమల అటవీ ప్రాంతంలోని చెంచు గిరిజన గ్రామాల్లోనే అని తెలిపారు. అక్కడి ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడానని, ఈ రోజుకీ అక్కడ చాలా మంది కనీస జీవన సౌకర్యాలు లేకుండా జీవిస్తున్నారన్నారు. సరైన దుస్తులు కూడా లేవని, సెల్ఫోన్ టవర్లు, రహదారులు కూడా లేవని ఆవేదన వ్యక్తంచేశారు. అలాంటి అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా గిరిజనులకు పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చారని రాంచందర్ రావు వివరించారు.
Also Read: కేసీఆర్ అంటేనే అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్- మాజీ మంత్రి జగదీష్ రెడ్డి